తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047' సన్నాహాలపై డీజీపీ సమీక్ష

by Ramesh Naini |

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047' సన్నాహాలపై రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ బి. శివధర్‌ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047 సన్నాహాలపై డీజీపీ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047' సన్నాహాలపై రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ బి. శివధర్‌ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం జరిగిన సమావేశంలో డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు సమ్మిట్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మిట్‌లో రాష్ట్ర పోలీసుల సాంకేతిక సామర్థ్యాలు, వినూత్న కార్యక్రమాలు, భద్రత, రక్షణపై వివరించాలని డీజీపీ అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమ్మిట్‌లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడంపై ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని, ఇన్నోవేషన్‌ ఇంక్యుబేటర్ల కోసం టీ-హబ్‌లో ఓ హ్యాకథాన్‌ను కూడా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం పూర్తిగా ఏఐ-ఆధారిత 'డయల్ 1930' వ్యవస్థను అమలు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా సైబర్ ఫోరెన్సిక్ హబ్‌లను విస్తరించడం ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు.

ప్రత్యేక 'పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్' యూనిట్లను, 'పోలీస్ రోబోటిక్స్ ఆర్గనైజేషన్‌'ను స్థాపించనున్నట్లు తెలిపారు. 'డయల్ 112' సేవలు మరింత బలోపేతం చేయాలని, అల్లర్లు, నేర సమన్వయాన్ని నిరోధించడానికి సోషల్ మీడియా ధోరణులు, డార్క్‌-వెబ్ / క్రిప్టో కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో సమ్మిట్ ముగిసిన అనంతరం 11 నుంచి 13 వరకు ప్రజల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ మహేష్ ఎం. భగవత్, టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్, టీజీఎస్పీఎఫ్‌ డైరెక్టర్‌ స్వాతి లక్రా, ఏడీజీపీ (సీఐడీ) చారు సిన్హా, ఐజీపీ మల్టీ జోన్-I ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి, ఐజీ కె. రమేష్‌ నాయుడు, ఏడీజీపీలు, ఐజీపీలు, డీఐజీలు, ఎస్పీలు, డీసీపీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Next Story