'రియల్'​ ముసుగులో ఈతవనం ధ్వంసం! అధికార పార్టీ నేతల అండతో ఇష్టారాజ్యం

by Disha Web Desk 4 |
రియల్​ ముసుగులో ఈతవనం ధ్వంసం! అధికార పార్టీ నేతల అండతో ఇష్టారాజ్యం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/ షాద్​నగర్​: రంగారెడ్డి జిల్లాలో రియల్​ వ్యాపారుల ఆగడాలు అంతా ఇంతా కాదు. ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ఫైరవీకారులతో అన్ని అనుమతులు తీసుకుంటున్నారు. పచ్చదనం, పర్యావరణం ధ్వంసమైతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వ్యాపారులకు తొత్తులుగా మారి విషయాన్ని గ్రహించకుండా కేసులు నమోదు చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తినే ధైవంగా భావిస్తూ ఇప్పటికీ అనేక వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈత, తాటి చెట్టును నమ్ముకొని బతుకుతున్న గౌడ కులస్తులను విచ్ఛిన్నం చేసే కార్యక్రమానికి రియల్ ​వ్యాపారులు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి చెలమలు, ఊటలు ఎక్కువగా ఉండే చెరువులు, లోయలు, కాల్వల పక్కన పెద్ద సంఖ్యలో ఈత వనం ఉంటుంది.

ఈ ఈత చెట్లను నమ్ముకొని గౌడ కులస్తులు కల్లు విక్రయాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారి బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం షాద్‌నగర్ ​నియోజకవర్గంలో జరుగుతుంది. రియల్ మాఫియా కాల్వలు, నాలాలు ధ్వంసం చేయడమే కాకుండా ఈత చెట్లను పూర్తిగా నాశనం చేస్తున్నారు.

అసలేం జరిగింది..?

షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం రేగడి చిలకమర్రి గ్రామంలో సర్వే నంబర్లు 240, 247, 248, 251‌లలో గల ఈత చెట్లను ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. క్షేత్ర ఫామ్ లాండింగ్ రియల్ అభివృద్ధి పనులు చేస్తున్న కామాక్షి, సురేష్, శీను అనే వ్యక్తులు చెట్లను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. పైగా అదే గ్రామానికి చెందిన మంచన్పల్లి రాజేందర్ గౌడ్ అనే వ్యక్తి పట్టా పొలంలో ఉన్న చెట్లను సైతం తీసివేయడం గమనార్హం.

అంతేకాదు కాలువ అంచున ఉన్న చెట్లను కూడా నరికి సదరు వ్యక్తులు కొంత స్థలాన్ని కబ్జా చేయడం గమనార్హం. దీనిపై గీత వృత్తిదారుడు, బాధితుడు రాజేందర్ గౌడ్ రియల్టర్లను ప్రశ్నిస్తే అతనిపై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఘటనా స్థలంలో బౌన్సర్లను పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సర్పంచ్ బుచ్చమ్మ వాపోతున్నారు.

నోటీసులు జారీ చేసినా బేఖాతరు

ఈ అక్రమాలపై గతంలో రియల్టర్లకు నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని, తాను ఒక దళితురాలు కాబట్టే తమ ఆదేశాలు పట్టించుకోవడంలేదని సర్పంచ్ వాపోయారు. సదరు జీపీ అనుమతులు లేకుండానే అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని దీనిపై నోటీసులు జారీ చేసినా బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలువ కబ్జా విషయమై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలంలో విచారణ జరిపారు. ఇరిగేషన్ డీఈ సత్య ప్రకాష్, ఇరిగేషన్ ఏఈ సింధుజ, ఆర్‌ఐ శివ, సర్వేయర్ ఆంజనేయులు తదితరులు విచారణ జరిపి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేయొద్దని వెంచర్ నిర్వాహకులకు హెచ్చరించారు. అయినా పనులు అలాగే జరుగుతున్నాయి.

ఆబ్కారీ శాఖ సైలెంట్

పామ్​ల్యాండ్ పేరుతో ఈత చెట్లను నరికిన రియల్​ వ్యాపారులపై గౌడ సంఘం నేతలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. అంతేకాకుండా ఆ గౌడ సంఘం నేతలపై రియల్ వ్యాపారుల మాటాలతో తిరిగి కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఆ వెంచర్ పక్కనుంచే పొలాలకు వెళ్లే దారిని పూర్తిగా కబ్జా చేసి కాల్వను పూడ్చివేసి మరో దారి చేస్తున్న అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారించడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ నిర్వాహకులపై ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

అధికార పార్టీ పెద్దల హస్తం

ఈత చెట్లను నరికివేయడమే కాకుండా కాల్వను కబ్జా చేసిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారించడంతో క్షేత్ర ఫార్మ్స్ యాజమాన్యం ధీమాగా తమ పని తాను చేసుకుంటున్నారు. అటు అధికారులు... ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా ఫాం ల్యాండ్​ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు, కబ్జాల వెనుక అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అందుకే తమకు న్యాయం జరగడం లేదని గౌడ సంఘం నేతలు మొత్తుకుంటున్నారు.

నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

సంపాదనే ధ్యేయంగా ఆక్రమణలు చేస్తూ రైతులు, ప్రభుత్వ పొలాలను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ సంస్థ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ గౌడ సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం వెంచర్ నిర్వాహాకులు ఆక్రమించిన స్థలాన్ని, ఈత చెట్లు ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. వారు మాట్లాడుతూ పొలంలో అక్రమంగా వేసిన కంచె తొలగించాలని, వెంచర్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోకుంటే ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed