మేలు రకం వరి సాగు చేయాలి: రైతులకు డిప్యూటీ సీఎం పిలుపు

by Vemula.Srinu Prasad |

జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అన్నదాతలను అదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పేర్కొన్నారు. ..

మేలు రకం వరి సాగు చేయాలి: రైతులకు డిప్యూటీ సీఎం పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అన్నదాతలను అదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదలు కూడా సన్న బియ్యం తినాలి, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళుతోంద‌న్నారు.

బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన కేబినేట్ ​సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగు పై కేబినెట్ సబ్ కమిటి చ‌ర్చింది. రైతులకు లాభ‌దాయ‌క‌మైన బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్​ఎన్​ఆర్​15048), కెఎన్​ఎం-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు క‌మిష‌న్ ప్రభుత్వానికి సిఫార‌సు చేసింది. ఆయా పంట‌ల‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉండ‌డం వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. మేలుజాతి వంగ‌డాలు స‌మృద్ధిగా ఉన్నాయని వీటిని సాగు చేస్తే రైతుల‌కు ఆదాయం గ‌ణ‌నీయంగా ఉంటుద‌ని వ్యవ‌సాయ క‌మిష‌న్ తెలిపింది.

ప్రభుత్వం ఈ వంగడాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరచడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించింది. రాబోయే సీజన్లలో ఈ రకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం, ఇటు మార్కెట్ రంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందని, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తుందని కేబినెట్ సబ్ కమిటీకి నివేదించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్ళకు తగ్గిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని, బాయిల్డ్ రైస్ ను ఏమాత్రం కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంద‌ని తెలిపింది.

ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాతీయ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story