Deputy CM Bhatti: అందరూ వద్దంటున్నా బీఆర్ఎస్ హయాంలో ఆ పని చేశారు

by Gantepaka Srikanth |

పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.

Deputy CM Bhatti: అందరూ వద్దంటున్నా బీఆర్ఎస్ హయాంలో ఆ పని చేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి నుంచి రాష్ట్రంలో జీరో విద్యుత్ బిల్లు(Zero electricity bill) అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీరో బిల్లు వల్ల సుమారు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు 39 వేలకు పైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ కింద రూ.199 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ దిశగా విద్యా సంస్థలను ప్రొత్సహిస్తున్నట్లు చెప్పారు.

అంతేకాదు.. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న సబ్‌స్టేషన్ల మరమ్మతులు సైతం ప్రారంభించామని తెలిపారు. నూతన విద్యుత్ విధానం అమల్లోకి వచ్చాక మిగతా వివరాలు ప్రకటిస్తామని అన్నారు. కేంద్రం ఆమోదించేందుకు జాప్యం జరుగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడిందని అన్నారు. కేంద్రం జాప్యం వల్ల భద్రాద్రి ప్రాజెక్టు(Bhadradri Project)పై 42 శాతం అదనపు భారం పెరిగిందని చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికరంగం గురించి శ్వేతపత్రం విడుదల చేశాం. ఆర్థికపరమైన విషయాలేవీ దాయలేదు. విద్యుత్ రంగం గురించి బీఆర్ఎస్ నేతలు చాలా తప్పుడు ప్రచారం చేశారు. విద్యుత్ విషయంలో సమగ్ర వివరాలను ప్రజలకు వివరించాం. గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ దిశగా అనేక చర్యలు చేపట్టాం. 2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తాం. త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తాం. సోలార్, విండ్, హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నాం. అందరూ వద్దంటున్నా బీఆర్ఎస్ హయాంలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Next Story