- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Bhatti Vikramarka: మాకు రావాల్సిన నిధులు ఇప్పించండి..కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి
రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను భట్టి విక్రమార్క కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ను కోరారు. శనివారం ఢిల్లీలో సఫ్దర్ జంగ్ రోడ్డులోని నిర్మలాసీతారామన్ నివాసంలో ఆమెను కాంగ్రెస్ ఎంపీలు, అధికారులతో పాటు భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం మంత్రికి అందజేశారు. వివిధ కార్పొరేషన్లు/ ఎస్ పీవీల ఋణ పునర్వ్యవస్థీకరణ విషయంలో ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావలసిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశం పైన ఈ సందర్భంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. ఈ డిప్యూటీ సీఎం వెంట ఎంపీలు మల్లు రవి,చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు ఉన్నారు.






