డీలిమిటేషన్‌పై CM రేవంత్ కొత్త ఫార్ములా: కేంద్రానికి కీలక సూచనలు

by Gantepaka Srikanth |

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీలిమిటేషన్‌పై CM రేవంత్ కొత్త ఫార్ములా: కేంద్రానికి కీలక సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని (Financial Capitals) ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్‌డీపీని (GSDP) అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు (Economic Growth) ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని కోరారు.

ఉత్తర - దక్షిణ అంతరం...

డీలిమిటేషన్ వల్ల ఉత్తరాదికి అదనంగా 208 సీట్లు పెరిగే అవకాశం ఉందని, అదే జరిగితే మ్యాజిక్ నెంబర్ కోసం దక్షిణాది రాష్ట్రాలతో పనిలేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమగ్రతకు, రెండు ప్రాంతాల మధ్య సమతుల్యతకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికిప్పుడే అమలు చేయాలని కోరిన సీఎం.. డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపాటు వద్దని సూచించారు. దీనికి 2028 వరకు సమయం ఉన్నందున, హడావిడి చేయకుండా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story