బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్.. చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసుల అనూహ్య నిర్ణయం

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్.. చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసుల అనూహ్య నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రేపు జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ దీక్షకు సంబంధించి ప్రెస్ మీట్‌లో కవిత మాట్లాడుతుండగానే అనుమతి విషయంలో ఆంక్షలు విధిస్తున్నామని సమాచారం ఇచ్చారు. దీంతో ఢిల్లీ పోలీసుల తీరుపై కవిత అసహనం వ్యక్తం చేశారు.

ముందు అనుమతి ఇచ్చిన తర్వాత ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేపటి దీక్ష స్థలాన్ని పరిశీలించారు. కావాలనే మా దీక్షకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని.. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేసిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా కవిత కృతజ్ఞతలు తెలిపారు. చాలా ప్రభుత్వాలు మారినా మహిళ బిల్లుకు మోక్షం దక్కలేదన్నారు. ఈ విషయంలో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మరీ బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రేపటి ధర్నాలో 18 పార్టీలు పాల్గొనబోతున్నాయని 10 గంటలకు సీతారాం ఏచూరి చేతుల మీదుగా ధర్నా మొదలవుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. తనను ఈడీ విచారణకు పిలిచిందని చెప్పారు. 11వ తేదీన విచారణ ఎదుర్కొబోతున్నట్లు తెలిపారు. మహిళలను వారి నివాసం వద్ద నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టే అవకాశం ఉన్నా తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదని తెలిపారు. ఈడీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదని.. దర్యాప్తుకు 100 శాతం సహకరిస్తానన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేసిందని.. అది విఫలం కావడంతో నన్ను టార్గెట్ చేశారని ఆరోపించారు.

మోడీకి తాను భయపడేది లేదని బీజేపీ కుట్రలను లీగల్‌గానే ఎదుర్కొంటామన్నారు. తాను ధైర్యంగా ఈడీ విచారణకు హాజరవుతున్నానని మరి బీఎల్ సంతోష్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోడీ ఎన్ని కుట్రలు చేసిన చివరకు ధర్మమే గెలుస్తుందని చెప్పారు. అవినీతి నేతలు బీజేపీలో చేరగానే క్లీన్ చీట్ వచ్చేస్తోందన్నారు. అదానీ వ్యవహారంపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. తనకు కేసీఆర్, కేటీఆర్‌తో పాటు పార్టీ మొత్తం అండగా ఉందని చెప్పారు.

కాంగ్రెస్ ఆ భ్రమల్లోంచి బయటకు రావాలి:

కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి పెద్ద రీజనల్ పార్టీగా మారిపోయిందని ఆ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని కవిత అన్నారు. తమది ఇంకా జాతీయ పార్టీనే అనుకునే కాంగ్రెస్ నేతలు ఆ భ్రమల్లోంచి బయటకు రావాలని హితవు పలికారు. ఇకనైనా ఆ పార్టీ తమ ఆలోచనలు కాకుండా దేశం ఆలోచన ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎక్కడైతే బలమైన రీజనల్ పార్టీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుని బీజేపీని ఓడించేందుకు మెట్టుదిగాలన్నారు. కాంగ్రెస్ అందరితో కలిసి పని చేస్తే బీజేపీని ఓడించవచ్చని చెప్పారు. బీఆర్ఎస్ ఎవరికి బీ టీమ్ కాదని తామే బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారబోతున్నామని చెప్పారు.

Read more:

బ్రేకింగ్ : కవిత దీక్షకు ఢిల్లీ పోలీసుల ఆంక్షలు..


Next Story

Most Viewed