ఒకే రోజు ఐదు పందుల మృతి.. కొత్త వైరసే కారణమా?

by Disha Web Desk 4 |
ఒకే రోజు ఐదు పందుల మృతి.. కొత్త వైరసే కారణమా?
X

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గత కొన్ని రోజులుగా పందులు మృత్యువాత పడుతున్నాయి. పక్క రాష్ట్రంలోని రాయచూరు, దేవసుగురు కొత్త వైరస్‌తో పెద్ద మొత్తంలో పందులు చనిపోయాయి. ఆ వైరస్ ఇక్కడి పందులకు సోకిందా అని ప్రజలు భయపడుతున్నారు. పందులు చనిపోయిన పరిసరాల్లో దుర్వాసనతో ప్రజలు ముక్కులు మూసుకోని తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీధుల్లో పరిసరాల శుభ్రత, మౌలిక వసతులు కల్పించడంలో ముందు ఉండాల్సిన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇంటి, నీటి టాక్సులను యజమానుల నుండి ముక్కునుండి వసూలు చేస్తున్న అధికారులు వీటిపై కూడా శ్రద్ధ పెట్టాలని వార్డులోని ప్రజలు కోరుతున్నారు. మార్చి నెల చివరి సంవత్సరం అకాడమీ ఈయర్ అయినందున టాక్స్ వసూల్ చేయడానికి సిబ్బందితో వెళ్లిన వారిని ప్రజలు నిలదీస్తున్నారు. వసతులు కల్పించడంలో పాలకమండలి, కమిషనర్ నిర్లక్ష్యం వహించడం‌పై ప్రజలు ఫైర్ అవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి మక్తల్‌లో వరుసగా పదుల సంఖ్యలో పందులు చనిపోతున్నాయి.

ఏదైనా వైరస్ సోకి చనిపోతున్నాయా అని ప్రజలు భయపడుతున్నారు. చనిపోయిన వాటిని తొలగించడానికి కామాటిలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజల ఆరోపిస్తున్నారు. వీధుల్లో ఇలా పందులు చనిపోవడం స్థానికులను కలవరపెడుతోంది. కొద్ది రోజుల కిందట పక్కరాష్ట్రం కర్ణాటకలోని దేవసుగురు వద్ద పెద్దమొత్తంలో పందులు వైరస్ కారణంగా చనిపోయాయని అక్కడ ఇపుడు ఒక పంది కూడా లేదని ఆ ప్రాంతం వారు చెబుతున్నారు.

ఇటు మక్తల్‌లోను వరుస పెట్టి పందులు చనిపోతుడంటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పందులు ఏ కారణంగా చనిపోతున్నాయని, ఒకవేళ వైరస్ కారణంగా అయితే మనుషులకు ఏమైనా ప్రమాదం ఉందా అని ఆరా తీస్తున్నారు. దీనిపై వెటర్నరీ అధికారులు స్పందించి చనిపోతున్న పందులను పరీక్షించి. మనుషులకు ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో పందులను తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed