హరిత హారానికి స్థలాలను గుర్తించండి.. సీఎస్​ శాంతి కుమారి

by Disha Web Desk 13 |
హరిత హారానికి స్థలాలను గుర్తించండి.. సీఎస్​ శాంతి కుమారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహించే హరిత హారం కార్యక్రమానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని సీఎస్ ​శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. శుక్రవారం ఆమె వివిధ విభాగాల సెక్రటరీలతో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కానున్న 2023 -24 హరిత హారంలో ఆయా జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఉన్న అనువైన స్థలాలను గుర్తించాలని తెలిపారు.దీంతో పాటు ప్రకృతి వనాలకు అవసరమైన అటవీ భూముల పై ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు హరిత హారం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.

ఫైర్​పై ఫైర్..

వేసవి కాలంలో ప్రజలు అగ్నిప్రమాదాల బారినపడకుండా తగు ముందు జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్​ కలెక్టర్లను కోరారు. అగ్నిప్రమాదాల నివారణ కేవలం అగ్నిమాపక శాఖపైనే వదలకుండా అన్ని ప్రభుత్వ విభాగాలను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రెండు అగ్నిప్రమాదాలు ప్రస్తావిస్తూ, అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే చేపట్టాల్సిన ముందు జాగ్రత చర్యలపై ప్రజలను చైతన్యపర్చాలని తెలియచేసారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశమున్న వాటిపై ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలన్నారు.

టెన్త్‌కు సర్వం సిద్ధం..

ఏప్రిల్ 4 వ తేదీ నుండి 13 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలకు 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఈ పరీక్షల నిర్వహణలో పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు గతంలో మాదిరిగా 11 పేపర్లు కాకుండా ఈ సారి కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో పోలీస్ శాఖ తోపాటు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

86.50 లక్షలు..

కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు 86.50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 14.23 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణి చేశామని సీఎస్​చెప్పారు. 10.73 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణి కొనసాగుతోందన్నారు. ఇటీవల ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని అన్నారు .జిల్లాలోని కంటి వెలుగు, ఆరోగ్య మహిళ శిబిరాలను కలెక్టర్లు సందర్శించి ఉత్తమ సేవలందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.

58,59 జీవోలపై..

నిరుపేదలకు లబ్ది కలిగే 58 , 59 ,76 ,118 జీవో లపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి పట్టాలపంపిణీ, క్రమబద్దీకరణకై నిర్దేశించిన మొత్తాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పేదలకు నివాస భూములులను పంపిణి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల అనుసరించి రాష్ట్రంలో 1039 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను పంపాలని జిల్లా కలెక్టర్లను కోరారు. వచ్చే తెలంగాణాకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఎస్సీ అభివృద్ధి శాఖ కమీషనర్ యోగితా రాణా, అగ్నిమాపక శాఖ డీజీ వై. నాగిరెడ్డి, పీసీసీఎఫ్‌ డోబ్రియల్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed