ఈటల ప్రయత్నం బెడిసికొట్టిందా? నేతల చేరికల అంశంపై విమర్శలు

by Disha Web Desk 4 |
ఈటల ప్రయత్నం బెడిసికొట్టిందా? నేతల చేరికల అంశంపై విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం సొంత పార్టీ నేతలకు కొంత తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది. ఆయన వ్యవహారం కంట్లో నలుసులా మారినట్లుగా విమర్శలు చేస్తున్నారు. ఉద్యమకారుడు కావడం, అందుకు తోడు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకున్న పరిచయాల నేపథ్యంలో జాయినింగ్స్ కమిటీ బాధ్యతలను ఈటలకు అప్పగించారు. కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేరికలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తూ ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు పలువురు సెలబ్రెటీలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే మునుగోడు సభలో చేరికలపై ఆయన చేసిన ప్రయత్నంపై సొంత పార్టీ నేతలే ఆయనపై పరోక్ష విమర్శలకు దిగినట్లు తెలుస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలోనే కాషాయతీర్థం పుచ్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. జాతీయ నాయకత్వం కూడా అందుకు ఓకే చెప్పింది. అయితే చేరికలకు సంబంధించి ఈటల చేసిన అత్యుత్సాహం బెడిసికొట్టిందని చెబుతున్నారు. వాస్తవానికి మునుగోడు సభలో ఆ నియోజకవర్గానికి చెందిన నేతలే చేరాలని రాజగోపాల్ రెడ్డి తొలుత నిర్ణయించుకున్నారు. మునుగోడు సమరభేరికి అయ్యే ఖర్చంతా కూడా ఆయనే భరించినట్లు చెబుతున్నారు. కాగా ఈటల నిర్ణయం రాజగోపాల్ రెడ్డికి, ఇతర స్థానిక నేతలకు అసంతృప్తిని మిగిల్చినట్లు టాక్. ఇతర నియోజకవర్గాలు, జిల్లాలకు చెందిన నేతలను కూడా ఇక్కడ చేర్చుకోవాలని ప్లాన్ చేయడం ఇతర నేతలకు ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలకే కంట్లో నలుసులా ఈటల మారాడంటూ పరోక్షంగా విమర్శలు చేయడం గమనార్హం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. బైపోల్ నేపథ్యంలో ఈ సభను ఒక ప్రచార సాధనంగా వినియోగించాలని, ఆ సభ పూర్తి క్రెడిట్ తనకే దక్కాలని రాజగోపాల్ రెడ్డి భావించారు. అయితే అమిత్ షా ఎదుట తన సత్తా ఏంటో చూపించుకోవాలని చూసిన ఈటల రాజేందర్ బొక్కబోర్లా పడ్డారని విమర్శలు వస్తున్నాయి. తొలుత ఈ సభలో భారీగా చేరికలుంటాయని ఈటల చెప్పారు. కానీ చివరి వరకు కూడా మునుగోడు సభలో ఎంతమంది చేరే అంశంపై స్పష్టత రాలేదు. అర్ధరాత్రి నాటికి చేరబోయేది కేవలం మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేతలు మాత్రమే అని పలువురు నేతలు వెల్లడించారు. అయినా చివరకు కొందరు నేతలను అమిత్ షా సమక్షంలో ఈటల చేర్చినా.. వందలాది మందిని జాయిన్ చేయించి అమిత్ షా తో శభాష్ అనిపించుకోవాలన్న తన పాచిక పారకపోవడంతో ఈటల చిన్నబుచ్చుకున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Next Story