వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై అవగాహన కల్పించండి : భట్టి విక్రమార్క

by M.Rajitha |
వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై అవగాహన కల్పించండి : భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న వేసవిలో నిరాటంకంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు గాను సీఎండీలు మొదలుకొని ఎస్సీ స్థాయి అధికారులు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర పర్యటనలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్ లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయడంలో భాగంగా రాష్ట్రంలోని ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో, వేసవి విద్యుత్ ప్రణాళిక అమలుపై సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశాల్లో అధికారులు, సిబ్బందితోపాటు రైతులు, వినియోగదారులు, మీడియా ప్రతిధులను భాగస్వాములను చేయాలని కోరారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ సమావేశంలో వివరించాలని ఆదేశించారు. అదే సందర్భంలో రైతులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు.

జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జనవరి 27న నోడల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ ను వెల్లడించి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. జనవరి 29న నోడల్ అధికారులు ట్రాన్స్కో ఉన్నతాధికారులతో కలిసి జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో వేసవి కార్యాచరణ పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఫిబ్రవరి 4న ఎస్సీలు డివిజన్ స్థాయిలో పూర్తి సిబ్బందితో కలిసి సమర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సబ్ స్టేషన్లలో ఓవర్ లోడ్ ఫీడర్లు, డిటిఆర్ లలో గత మూడు సంవత్సరాలుగా ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారో క్షేత్రస్థాయి సమావేశాల్లో వివరించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం వంటి అంశాలను ఈ సమావేశాల్లో చర్చించాలని కోరారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story