రాష్ట్రంలో రూ.1500 కోట్ల పంటనష్టం జరిగింది: తమ్మినేని

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో రూ.1500 కోట్ల పంటనష్టం జరిగింది: తమ్మినేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నాలుగు రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ధాన్యం, మామిడి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పిడుగులు పడటంతో ప్రాణనష్టం, ఆస్థినష్టం జరిగిందని, గొర్రెలు, మేకలు, కోళ్లు చనిపోయాయని వివరించారు. తక్షణమేనష్టాల గణాంకాల పూర్తి వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2018 నుంచి నేటివరకు 1500 కోట్ల పంటల నష్టం వాటిల్లిందన్నారు.

2020 నుంచి 2023 వరకు రు.1787కోట్లు 15వ ఫైనాన్స్‌ కమిషన్‌లో ప్రకటించినా నేటికీ నష్టపరిహారం అందింది నామమాత్రమేనని తెలిపారు. 2022 వానాకాలంలో అధిక వర్షాల వల్ల 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 6గురు మరణించారు. ఈ ఏడాదిలోనే రూ.3500 కోట్లు నష్టం వాటిల్లింది. దానికి తోడు ప్రస్తుతం వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి, జీవాలు, ఇతరత్రా నష్టం జరిగిన వారికి ఆర్థిక సహాయం అందించాలి. ప్రాణాలు కోల్పోయినవారికి ఎక్స్‌గ్రేషియో చెల్లించి వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రు. మూడు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జరిగిన నష్టంపై పరిశీలనకు ప్రత్యేక టీంను పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు.


Next Story