మునుగోడులో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. CPM సంచలన నిర్ణయం

by Disha Web Desk 2 |
మునుగోడులో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. CPM సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య పోరు తీవ్రతరం అయింది. గెలుపే లక్ష్యంగా సాగుతున్న ప్రధాన పార్టీలు తమతో కలిసి వచ్చే ఇతర పార్టీల మద్దతు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో సిట్టింగ్ పార్టీ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. సీపీఐ బాటలోనే నడిచేందుకు సీపీఎం సిద్ధమైంది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక ప్రకటన చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తాము టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన గురువారం వెల్లడించారు. బీజేపీని ఓడించేందుకు సీపీఎం అధికార పార్టీకి మద్దతుగా నిలబడబోతున్నట్లు తమ్మినేని కన్ఫామ్ చేశారు.

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ:

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం వచ్చినా అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆరోపించారు. సీపీఎం బీజేపీని వ్యతిరేకిస్తుందని అది దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మునుగోడులో టీఆర్ఎస్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. టీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు ఒక్క మునుగోడు ఉప ఎన్నిక వరకేనని క్లారిటీ ఇచ్చారు. మద్దతు ప్రకటించినంత మాత్రాన ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

కాంగ్రెస్‌కు షాక్:

సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయంపై ఇవాళ తమ్మినేని వీరభద్రం క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని తమ పార్టీని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కోరాయని, అయితే బీజేపీని ఓడించేందుకు తాము టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తమ్మినేని స్పష్టం చేశారు. ఇప్పటికే సీపీఐ కారు పార్టీకి మద్దతుగా నిలవగా తాజాగా సీపీఎం సైతం అదే బాటలో పయణించడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టుల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసింది. రాబోయే ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఆశపడింది. ఆ దిశగా ప్రయత్నాలు సైతం చేసింది. కానీ కాంగ్రెస్‌ను కాదని కమ్యూనిస్టులు అధికార పార్టీ వైపే మొగ్గుచూపడంతో ఈ బై ఎలక్షన్‌లో గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Also Read : మునుగోడుపై స్పీడ్ పెంచిన బీజేపీ.. ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా కీలక నేత



Next Story

Most Viewed