ఓట్ల కోసం కక్కుర్తిపడి కులాలు, మతాలను రెచ్చగొట్టారు: సీపీఐ నారాయణ

by Disha Web Desk 2 |
ఓట్ల కోసం కక్కుర్తిపడి కులాలు, మతాలను రెచ్చగొట్టారు: సీపీఐ నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రధాని మోడీకి చెంపపెట్టు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారాలను ఎన్నో చూశాం.. కానీ ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్నవారు కర్ణాటకలో సుదీర్ఘకాలం అక్కడే ఉండి కులాలను మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా ఓట్లు సంపాదించాలని ప్రయత్నించారని, అయినా ఫలించలేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లౌకిక వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధాని ఓట్ల కోసం కక్కుర్తిపడి కులాలను, మతాలను రెచ్చగొట్టారని, చివరికి బజరంగ్ జిందాబాద్ అనే స్థాయికి వెళ్లడం.. ఆయన నైతికతకు నిదర్శనమన్నారు.

రాహుల్ గాంధీ మీద చేసిన కుట్రలు ఫలించకపోగా.. అవి సానుభూతిగా పనికొచ్చాయని అన్నారు. అలాగే పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలపై వ్యతిరేకత కూడా బీజేపీని ఓడించిందన్నారు. ఆంధ్రా, తెలంగాణలో రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయన్నారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యూలర్ ఫోర్స్‌ల మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని నారాయణ అన్నారు.


Next Story