ఆ ఉద్యోగుల కోసం సీఎం కేసీఆర్‌కు సీపీఐ నారాయణ లేఖ

by Disha Web Desk |
CPI Narayana Takes his Words Back Over Megastar Chiranjeevi
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల అంతర్‌ రాష్ట్ర బదిలీల సమస్యను పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అక్టోబర్ 23న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 1369 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిని ఏపీకి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం లేదని ధృవీకరణ (ఎన్ఓసీ) ఇచ్చి పంపిందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ ఉద్యోగులను తీసుకొడానికి అంగీకరించిందన్నారు.

అదేవిధంగా తెలంగాణకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 1808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావాలని దరఖాస్తు చేసుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వారికి ఎన్‌ఓసీ ఇచ్చి సంబంధిత పత్రాన్ని తెలంగాణకు పంపిందన్నారు. కావున తెలంగాణ ప్రభుత్వం 1808 అంతర్‌ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను మానవతా దృక్పథంతో పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అంగీకారాన్ని తెలియజేయాలని సీఎంను కోరారు. అంతర్రాష్ట్ర బదిలీలకు కొరకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు రిజర్వేషన్లు, స్థానికత, ఆరోగ్య కార్డులు, వృద్ధులైన తల్లిదండ్రులకు సంబంధించినటు వంటి పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని సీఎంను లేఖలో కోరారు.



Next Story

Most Viewed