రాష్ట్రపతి ‘విడో’ అనే పార్లమెంట్ ఓపెనింగ్ చేయించట్లేదా? నారాయణ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
రాష్ట్రపతి ‘విడో’ అనే పార్లమెంట్ ఓపెనింగ్ చేయించట్లేదా? నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో ఓపెనింగ్ చేయించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివాసీ, ఆదర్శవంత మహిళ అని చెప్పి మీరు ప్రెసిడెంటును చేశారు. రాష్ట్రపతి విధవ కాబట్టే పార్లమెంటు భవన్‌ను ప్రారంభించేందుకు ఆహ్వానించలేదా? బీజేపీ పార్టీ యాగాలు, యజ్ఞాలు, జాతకాలు, సెంటిమెంట్లు.. అంటూ రకరకాల పద్ధతుల్లో ఆలోచిస్తాయి.

శుభకార్యాలు ముత్తైదువులతోని జరిపించాలని శాస్త్రం పెడతారు. కాబట్టి ప్రారంభోత్సవానికి ఈ సెంటిమెంట్ అడ్డు వచ్చిందా? శాస్త్రాలు అడ్డు వచ్చాయా? విధవను తీసుకు వచ్చి ఇక్కడ పెట్టవద్దని చెప్పాయా? ఆ సెంటి‌మెంట్స్‌తోనే పని చేస్తున్నారా?’’ అని తనకు అనుమానం కలుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నూతన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించిందని, మోడీ సొంత డబ్బులతో కాదని తెలిపారు. దాని ప్రారంభోత్సవం చేయాలంటే 79 అధికరణ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండడం వల్లే 22 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతిని పక్కన పెట్టి.. ఎందుకు పట్టు బట్టి భవనాన్ని మోడీనే ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు.

ద్రౌపది ముర్ము విధవరాలు కాబట్టి ఈ ప్రారంభోత్సవానికి వారు పిలవడానికి సిద్ధంగా లేరని ఆరోపించారు. డెమోక్రటిక్ కంట్రీకి ఇది పెద్ద అవమానకరమని, ఈ పద్దతుల్లో దేశాన్ని పాలిస్తున్నారా? అని నిలదీశారు. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని తుంగలో తోక్కారని, దేశంలో లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమైందని ప్రశ్నించారు. ఈ పద్దతుల్లో చేస్తే మాత్రం మహిళలను బహిరంగంగా అవమానపరిచిన బీజేపీగా గుర్తిస్తామన్నారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణ భారత దేశంలో బీజేపీకి గేటు మూసేశారన్నారు. ఇప్పుడు రాజదండం ‘సెంగోల్’ తీసుకొచ్చి పార్లమెంటులో పెడుతున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం ఈ దండం ద్వారా వచ్చిందా? అని ప్రశ్నించారు. అధికార బదిలీకి చిహ్నంగా గతంలో బ్రిటిష్ వారు రాజదండం అప్పటి ప్రధాని నెహ్రూకి ఇచ్చారని బీజేపీ చెబుతున్నదని, అయిన కూడా ప్రధాని దానిని మ్యూజియంలో పెట్టారని అన్నారు. ఈ రాజదండం ద్వారా అధికార బదిలీ కాలేదన్నారు. గాంధీ, భగత్ సింగ్ లాంటి నాయకులు ఎంతో మంది దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు, పోరాటాలు చేస్తే స్వాతంత్ర్యం వచ్చిందని, అందుకే బ్రిటిష్ వారు వెళ్లిపోయారని అన్నారు.

స్వాతంత్ర్య పోరాటం పక్కన పెట్టి కేవలం అధికార మార్పిడి జరిగిందని అంటన్నారని మండిపడ్డారు. ‘‘మీరు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు కాబట్టి మీకు తెల్వదు.. పోరాటంలో ఎంతో మంది అమరులు అయ్యారు. కేవలం నూతన భవనం ద్వారా పాత చరిత్రను తుంగలో తొక్కి సంప్రదాయం పేరుతో అనేక సెంటిమెంట్లను అడ్డు పెట్టుకొని ప్రారంభిస్తున్నారు’’ అని అన్నారు. అందుకే ప్రారంభోత్సవానికి 22 పార్టీలు కలిసి వ్యతిరేకించి బాయ్ కాట్ చేశాయన్నారు.. నిజంగా ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగిస్తే.. దానిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో కలిసి ఈ విషయాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని బీజేపీ సర్కార్‌కు సూచించారు


Next Story

Most Viewed