గౌరవెళ్ళి ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకోండి.. సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ

by Dishafeatures2 |
గౌరవెళ్ళి ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకోండి.. సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గౌరవెళ్ళి ప్రాజెక్టులో ముంపునకు గురైతున్న గుడాటిపల్లి గ్రామ భూనిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెళ్ళి ప్రాజెక్టులో గుడాటిపల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురైతున్నదని తెలిపారు. 2009-10లో 1.4 టీఎంసీల సామర్థ్యం ఉన్న గౌరవెళ్ళి ప్రాజెక్టును 8.23 టీఎంసీల వరకు పెంచడం మూలంగా గుడాటిపల్లి గ్రామంలో అనేక ఇండ్లు, వ్యవసాయ భూములకు, 10 ఇండ్లకు రెండు పశువుల కొట్టాలు ముంపునకు గురైనాయని పేర్కొన్నారు. వాటికి పరిహారం అందించలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. సుమారుగా వంద మంది అమ్మాయిలకు పెళ్లీలు కావడం మూలంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇంకా ఇవ్వలేదన్నారు.

ప్రాజెక్టు సామర్థ్యం మూలంగా 116 ఎస్టీల ఇండ్లు 200 మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. అలాగే హుస్నాబాద్‌ శాసనసభ్యుడు సుమారు 1600మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం కింద 5.04 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని, ఊరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నదని, ఇప్పటికి నిర్వాసితులుకు పరిహారం అందకపోవడం తీవ్ర నిరాశకు లోనైతున్నారని తెలిపారు. భూ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపడితే ప్రజలను పోలీసులు తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. కాబట్టి గౌరవెళ్ళి ప్రాజెక్టులో ముంపునకు గురైతున్న గుడాటిపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితుల అన్ని రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేఖలో కోరారు.

Next Story