తెలంగాణ సర్కార్ మాస్టర్ స్కెచ్.. అప్ గ్రేడ్ పేరుతో ఆ పనికి కేంద్ర నిధులు డైవర్ట్..!

by Disha Web Desk 19 |
తెలంగాణ సర్కార్ మాస్టర్ స్కెచ్.. అప్ గ్రేడ్ పేరుతో ఆ పనికి కేంద్ర నిధులు డైవర్ట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకో మెడికల్​కాలేజీ నిర్మాణాలకూ కేంద్రం నుంచి వచ్చిన పైసలే దిక్కయ్యాయి.15వ ఆర్థిక సంఘం, నేషనల్ హెల్త్​మిషన్​నిధులతోనే కొత్త మెడికల్​కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆసుపత్రుల అప్​గ్రేడేషన్​పేరిట ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిసింది. 2021లో మంజూరైన సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్​కర్నూల్, రామగుండం కాలేజీల ఏర్పాటుకు 15వ ఫైనాన్స్, ఎన్​హెచ్ఎం నిధులనే అత్యధికంగా వాడారు.

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్​నుంచి కేవలం రూ.200 కోట్లు మించకుండా ఖర్చు చేసినట్లు సమాచారం. 2022లో మంజూరైన నిర్మల్, ఆసీఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్లా, వికారాబాద్ మెడికల్​కాలేజీల ఏర్పాటుకూ కేంద్రం నుంచి వచ్చే పైసలపైనే ప్రభుత్వం ఆధారపడుతున్నదని సెక్రటేరియట్‌లోని ఓ అధికారి తెలిపారు.

కానీ ప్రభుత్వం మెడికల్​కాలేజీల కోసం ప్రత్యేకంగా బడ్జెట్​ఖర్చు చేస్తున్నదని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎంతో సహా, బీఆర్ఎస్​నేతలు గొప్పలు చెప్పుకోవడం విశేషం. ప్రజల్లో మార్కులు కొట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా పాకులాడుతున్నదని ప్రతిపక్షాలు విమర్శలు అందుకున్నాయి. వైద్యశాఖలోని వివిధ కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులనే వాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కోసం ప్రచారం చేసుకోవడం గమనార్హం.

మెడికల్ 'ఫైర్​'..

ప్రభుత్వ మెడికల్​కాలేజీల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం విధితమే. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్​ (సీఎస్‌ఎస్‌) కింద తెలంగాణకు కనీసం ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా విమర్శించగా, దానికి కౌంటర్‌గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా కాలేజీలు ఉన్న చోటనే ప్రపోజల్స్​పంపించారంటూ సమాధాన మిచ్చారు. అయితే ఆమె ప్రభుత్వం ఆధీనంలో నిర్వహిస్తున్నవా? ప్రైవేట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెడికల్ కాలేజీలా? అనేది మాత్రం ఆమె మాటల్లో క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలకు ప్రతిపాదనలు పంపితే ఎందుకు? మెడికల్​కాలేజీలు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాలకు ఒక నీతి తెలంగాణకు ఒక నీతా అంటూ హరీష్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్​కాలేజీ అంశంపై నిత్యం ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడం విచిత్రకరంగా ఉన్నది.

ఇది జరిగింది..?

సెంట్రల్లీ స్పాన్సర్డ్​స్కీమ్​కోటాలో 2014 నుంచి దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే ఫస్ట్​రౌండ్‌లో తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా రాకపోవడంతో తమకు కూడా కాలేజీలు ఇవ్వాలని 2015లో రాష్ట్రం కేంద్రానికి ప్రపోజల్​పెట్టింది. అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది. సీఎస్‌ఎస్​కింద తెలంగాణకు కాలేజీలు కేటాయించలేదని అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ ద్వారా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి రిప్లే ఇచ్చారు. సీఎస్ఎస్​కోటాలో మెడికల్​ కాలేజీలు రావాలంటే ఆయా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​కాలేజీలు ఉండకూడదనే రూల్ ఉన్నట్లు కేంద్రం గుర్తు చేసింది. 2016 వరకు తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​కాలేజీలు ఉండేవి.

అదే సంవత్సరంలో 21 కొత్త జిల్లాలను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.అయితే ఆ తర్వాత సీఎస్​ఎస్​కింద మెడికల్​కాలేజీలు ఇవ్వమని రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం చెబుతున్నది. ఇక 2018 రెండో దశ లోనూ రాష్ట్రానికి మెడికల్​కాలేజీలు మంజూరు కాలేదు. దీంతో మూడో దశలోనైనా తమకు సీఎస్​ఎస్​కింద మెడికల్​కాలేజీలు ఇవ్వాలని అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కేంద్రానికి 8 ఆగస్టు 2019న లేఖ రాశారు. దానిలో కరీంనగర్, ఖమ్మంకు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు.

అయితే మూడో దశలో ఆంధ్రప్రదేశ్​కు 3,కర్ణాటకకు 4, తమిళనాడుకు 11 మెడికలల్​కాలేజీలను ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మళ్లీ మొండిచేయి చూపింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెడికల్​కాలేజీల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా సీఎస్‌ఎస్‌ స్కీమ్​లో మెడికల్​ కాలేజీల ఏర్పాటుకు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తన వంతు వాటా గా 90 శాతం నిధులు ఇవ్వగా, మిగతా రాష్ట్రాలకు 60–40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నదని రాష్ట్ర వైద్యాధికారుల్లో ఒకరు తెలిపారు.

Next Story

Most Viewed