బిహార్ ఎన్నికలపై కాంగ్రెస్ వర్కవుట్.. తెలంగాణ స్ట్రాటజీ అమలుకు ప్లాన్

by Kema Shiva Kumar |

కాంగ్రెస్​ తెలంగాణలో అమలుచేసిన ఎన్నికల వ్యూహాన్ని బిహార్​లోనూ అమలు చేస్తున్నది.

బిహార్ ఎన్నికలపై కాంగ్రెస్ వర్కవుట్.. తెలంగాణ స్ట్రాటజీ అమలుకు ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ తెలంగాణలో అమలుచేసిన ఎన్నికల వ్యూహాన్ని బిహార్​లోనూ అమలు చేస్తున్నది. గతంలో ఇక్కడ కలిసొచ్చిన వ్యూహాలు, సెంటిమెంట్లను అక్కడా అమలు చేయనున్నారు. తెలంగాణలో అమలు చేసిన ప్రయోగం, ప్రచారం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు. బిహార్​లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ భాగస్వామ్యంతో ఆర్జేడీ అధికారంలో ఉంది. ఈనెల 24న కాంగ్రెస్​అత్యున్నత విధాన నిర్ణయాక మండలి వర్కింగ్​కమిటీ సమావేశాన్ని బిహార్​రాజధాని పాట్నాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి అగ్రనేతలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ఖర్గే, లోక్​సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ, ప్రియాంకగాంధీ, మాజీ స్పీకర్​మీరా కుమార్​తో సహా కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నారు.

24న కాంగ్రెస్ తొలి జాబితా

ఈనెల 24న బిహార్ లో కాంగ్రెస్ ​అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలిసింది. 38మంది అభ్యర్థుల లిస్టు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బిహార్​లో ఆర్జేడీతో పొత్తులో భాగంగా పోటీచేస్తున్న కాంగ్రెస్​తమకు 76 సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బిహార్​లో రాహుల్​గాంధీ చేపట్టిన ఓటర్​అధికార్​యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అక్కడ అధికారం చేపడతామనే దీమాలో కాంగ్రెస్​ఉంది. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్​16, 17వ తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. కొంగరకలాన్​లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్​ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్​గాంధీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీలకు విశేష ఆదరణ లభించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బిహార్ లోనూ ఆరు గ్యారెంటీల తరహా పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

సీఎం రేవంత్​ బిజీ షెడ్యూల్

సీఎం రేవంత్​రెడ్డి ఈ వారంలో ఆయా రాష్ట్రాల పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. ఈనెల 22న జాతీయ రహదారులపై ఢిల్లీ నుంచి వచ్చే అధికారులతో సమీక్షించనున్నారు. 23న ఉదయం ములుగు జిల్లా మేడారం క్షేత్రంలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి వచ్చి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే 24న బిహార్​రాష్ట్ర రాజధాని పాట్నాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే 25న తమిళనాడులో సీఎం స్టాలిన్ నీట్​పై నిర్వహించే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈనెల 26న హైదరాబాద్ లో నూతనంగా చేపట్టిన 139 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్నారు. అంబర్​పేట బతుకమ్మ కుంట పునరుద్ధరణ ప్రారంభం, బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని అధికారవర్గాలు వెల్లడించాయి.

Next Story