తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా తూనం శ్రవణ్‌కు ఎన్నిక

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-17 07:50:54  IST  )

తీవ్ర ఉద్రిక్తతల నడుమ తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సమాన ఓట్లు ఉండటంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా చైర్మన్‌ను ఎంపిక చేశారు.

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా తూనం శ్రవణ్‌కు ఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. భారీ హైడ్రామా, ఉద్రిక్తతల నడుమ జరిగిన ఈ ఎన్నికలో కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ కౌన్సిలర్ తూనం శ్రవణ్ (Thunam Shravan) లాటరీ పద్ధతిలో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అధికారులు నిబంధనల ప్రకారం లాటరీ (Draw of Lots) పద్ధతిని అనుసరించారు. లాటరీ తీయగా, అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రవణ్‌ను వరించింది. దీంతో అధికారులు ఆయన్ను మున్సిపల్ చైర్మన్‌గా ప్రకటించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, ఈ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎట్టకేలకు ఫలితం వెలువడటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Next Story