అధికారంలో ఉన్నామ‌ని ఆయన భ్రమ‌ల్లో ఉన్నారు : కేటీఆర్ పై విప్ బల్మూరి వెంకట్ విమర్శలు

by Naga Rani Yarlagadda |

స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ లో కేటీఆర్ డ్రామా చేశారని, తామే ఆస్పత్రి క‌ట్టి రోగులకు సేవ‌లు అందుబాటులోకి తీసుకువ‌చ్చినట్లుగా ఆయన చెప్పుకున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్ మండిపడ్డారు.

అధికారంలో ఉన్నామ‌ని ఆయన భ్రమ‌ల్లో ఉన్నారు : కేటీఆర్ పై విప్ బల్మూరి వెంకట్ విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ లో కేటీఆర్ డ్రామా చేశారని, తామే ఆస్పత్రి క‌ట్టి రోగులకు సేవ‌లు అందుబాటులోకి తీసుకువ‌చ్చినట్లుగా ఆయన చెప్పుకున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. శనివారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారిసిస్టిక్ పర్సనాలిటీ త‌న‌ను తాను గొప్ప ప‌నులు చేశామ‌ని చెప్పుకునే రోగం ఇదని, ఇది ఆయనకు వ‌చ్చిందని బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు. ఆయన వ‌స్తే డాక్టర్ ద‌గ్గర‌కు తీసుకెళ్లి రోగాన్ని న‌యం చేయిస్తామన్నారు. తానే డీప్యూటీ సీఎం, మంత్రి అన్నట్లుగా కేటీఆర్ స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ లో ప‌ర్యటించారని, ఆస్పత్రికి పోతే ఓ ప‌ద్దతి ప్రకారం వెళ్లాలని, వంద‌లాది మంది జ‌నాన్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే ఎందుకు టిమ్స్ మొద‌లు పెట్టలేదని, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం కోసం జీవో ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏడేళ్లు ప‌ట్టిందని బల్మూర్ వెంకట్ విమర్శించారు.

గ‌చ్చిబౌలిలో ఒక బోర్డు పెట్టి టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారని, తాము ధ‌ర్నాలు చేస్తే హాస్పిట‌ల్స్ లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించారని తెలిపారు. ప‌దేళ్లలో కొత్తగా ఒక్క ఆస్పత్రి నిర్మాణానైనా మొద‌లు పెట్టి పూర్తి చేశారా? ఏ ఆస్పత్రిని ప్రారంభించారో కేటీఆర్ చెప్పాలని బల్మూర్ వెంకట్ నిలదీశారు. కాంట్రాక్టర్ల ద‌గ్గర క‌మిష‌న్ల కోసం నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచారని, వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్పత్రి నిర్మాణం లో ఇష్టానుసారంగా గ‌త ప్రభుత్వం వ్యవ‌హ‌రించిందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ కేవ‌లం 14 శాతం ప‌నులు మాత్రమే జ‌రిగాయని, సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేసి రెండేళ్లలో 80% ప‌నుల‌ను తమ ప్రభుత్వం చేసిందన్నారు. జూన్ నెలాఖ‌రు నాటికి స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ ప్రజ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తుందని ఆయన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ను కూడా తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువ‌చ్చిందని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ తీసుకురావ‌డం ఇదే మొద‌టి సారని బల్మూర్ వెంకట్ తెలిపారు. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో డ‌యాల‌సిస్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నామని, అంబులెన్స్ ల‌ను పెంచామని, వైద్య సేవ‌ల‌ను మెరుగుప‌రుస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందేలా చర్యతలు చేపడుతుందన్నారు. ఇంకా తాము అధికారంలో ఉన్నామ‌ని కేటీఆర్ భ్రమ‌ల్లో ఉన్నారని, మంత్రి అనుకొని ఇంకా అధికారుల‌పైన జులుం ప్రద‌ర్శిస్తున్నారని బల్మూర్ వెంకట్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బిక్ష వ‌ల్లనే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారన్నారు. ఇలాగే తిరిగితే జ‌నం రాళ్లతో కొడ‌తారు జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.

Next Story