కాంగ్రెస్ మార్క్‌ గూండాగిరి రాజ్యమేలుతోంది.. మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-18 12:56:38  IST  )

క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ మెజార్టీ సాధించినా, అధికార బలంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ మార్క్‌ గూండాగిరి రాజ్యమేలుతోంది.. మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగురి రాజ్యమేలుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అక్రమ అరెస్ట్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో అరాచక పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. క్యాతన్‌పల్లి (Katanpally) మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను, ధనబలాన్ని అడ్డుపెట్టుకుని చట్టాలను కాలరాస్తోందని మండిపడ్డారు. క్యాతన్‌పల్లిలో ప్రజలు బీఆర్ఎస్‌కు పట్టం కట్టారని.. కానీ కాంగ్రెస్ నేతలు కిడ్నాప్‌లు, అక్రమ అరెస్టులతో చైర్మన్ పీఠాలను కబ్జా చేయాలని చూస్తోందని అన్నారు. భూములను కబ్జా చేసినట్లే పదవులను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు.

కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట

రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ (Congress) అరాచక వైఖరికి పరాకాష్ట అని, ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చఏవారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలను గౌరవించాలని, అడ్డదారుల్లో పదవుల కోసం ప్రయత్నించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణిపై బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని హరీష్ రావు స్పష్టం చేశారు.

ఇది రేవంత్ ప్రభుత్వ పిరికిపంద చర్య.. బాల్క సుమన్ అరెస్ట్ పై కేటీఆర్ ఆగ్రహం

Next Story