అన్నా ఒక్క చాన్స్ ప్లీజ్.. టీపీసీసీ, ఏఐసీసీ కీలక నేతలకు రిక్వెస్ట్!

by Disha Web Desk 12 |
అన్నా ఒక్క చాన్స్ ప్లీజ్.. టీపీసీసీ, ఏఐసీసీ కీలక నేతలకు రిక్వెస్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పైరవీలు షురూ అయ్యాయి. గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నోళ్లు ఢిల్లీ కేంద్రంగా టికెట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కీలక నాయకులతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో మంచి సంబంధాలు కలిగిన టీపీసీసీ, ఏఐసీసీ కీలక నేతలకు ‘అన్నా.. ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ఆయా కీలక నేతలు కూడా టికెట్లు ఆశిస్తున్న లీడర్లకు భరోసా ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాలకు చెందిన లీడర్లే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

కొత్తవాళ్లే ఎక్కువ?

గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈ దఫా టికెట్ల కోసం పోటీ పెరిగింది. 119 సీట్లకు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తమకు టికెట్ రాదేమోననే భయంతో కొంతమంది లీడర్లు రాష్ట్ర నేతల సహకారంతో ఢిల్లీలో టికెట్ ఫైనల్ తీసుకోవాలని భావిస్తున్నారు. సీనియర్లు, పాత లీడర్లకు టికెట్ల టెన్షన్ లేకపోవడంతో.. కొత్త ఆశావహులే పైరవీలు స్టార్ట్ చేసినట్లు ఓ నేత తెలిపారు. అయితే సర్వేలు, ప్రజాదరణను పార్టీ హైకమాండ్ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ వేవ్‌లో గెలుస్తామని..

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కంటిన్యూగా మూడోసారి పవర్ లోకి వచ్చిన పార్టీలు లేవు. అందుకే బీఆర్ఎస్ కూడా ఓడిపోతుందనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. టికెట్ పొందితే కాంగ్రెస్ వేవ్ లో గెలుస్తామనే ధీమాలో చాలా మంది లీడర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ అర్బన్ కంటే జిల్లా కేంద్రాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలే ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed