బుల్డోజర్​పెట్టినా.. తెలంగాణలో BJP లేవదు: అద్దంకి దయాకర్ ఫైర్

by Disha Web Desk 19 |
బుల్డోజర్​పెట్టినా.. తెలంగాణలో BJP లేవదు: అద్దంకి దయాకర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: “బుల్డోజర్​పెట్టినా.. తెలంగాణలో బీజేపీ లేవదు. ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలు, అభివృద్ధి కంటే మతమే ఎజెండాగా ముందుకు పోతున్నది. సోషల్​మీడియా, డబ్బు ఆధారంగా అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నది. ప్రజలు గ్రహించాలి. లేకుంటే భావితరాలు నష్టపోతాయి” అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​పేర్కొన్నారు.

గాంధీభవన్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తుందన్నారు. అందుకే ఈటల అవగాహన లేమితో ఫ్రస్టేషన్‌కు గురై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం కంటే.. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు కొనాల్సి వచ్చిందని ఈటల బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.

ఈటల ఆరోపణలు నిజమైతే.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలన్నారు. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. మోడీ, అమిత్ షా‌ దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదంతా ప్రెసిడెంట్ పోస్టు కోసమే ఈటల ప్రయత్నిస్తున్నారని అద్దంకి చెప్పారు. మరోవైపు బీజేపీని లేపడానికి కేసీఆర్ వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారని, ఓట్లు చీల్చేందుకు మాత్రమే కేసీఆర్ బీజేపీ‌కు హైప్ ఇస్తున్నాడన్నారు.

దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోతున్నాయన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటె బీఆర్ఎస్‌పై గట్టి పోరాటం చేయలన్నారు. సహారా కుంభకోణంలో కేసీఆర్‌పై ఎందుకు కేసు కొట్టేశారో? బీజేపీ స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో జరిగిన అవినీతి పై బీజేపీ స్టాండ్ ఏమిటీ? అని ప్రశ్నించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఎందుకు తీసుకున్నదో? అందరికీ తెలుసునని పేర్కొన్నారు. కర్ణాటకలో జేడీఎస్, ఎంఐఎం కలయిక వెనక బీజేపీ, బీఆర్ఎస్ హస్తం ఉన్నదన్నారు.


Next Story

Most Viewed