‘ధరణి’ బాధితులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్

by Disha Web Desk 2 |
‘ధరణి’ బాధితులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్ బాధితులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను క్లియర్ చేయడానికి గడువును నిర్దేశిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులందరూ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించింది. మండల తహశీల్దార్ ఏడు రోజులు, ఆర్డీవో మూడు రోజులు, అదనపు కలెక్టర్ మూడు రోజులు, కలెక్టర్ ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.

ప్రతి మండలంలో 2-3 బృందాలను నియమించనున్నారు. ఈ టీమ్‌లు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో పని చేయనున్నాయి. ప్రతి దరఖాస్తును పరిశీలించి.. అవసరమైతే ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఏ ఒక్కటీ పెండింగులో ఉంచొద్దని ఆదేశించారు. ప్రభుత్వ భూములను తప్పనిసరిగా పరిరక్షించే విధంగానే డ్రైవ్ ఉండాలన్నారు. తహశీల్దార్లు, ఆర్డీవోల ద్వారా కలెక్టర్లను ప్రతి రోజూ మానిటరింగ్ చేయాలని మార్గనిర్దేశం చేశారు.


Next Story

Most Viewed