సబ్ కాంట్రాక్టర్లంతా గులాబీ లీడర్లే.. నిర్మాణాలన్నీ గణపతి‌రెడ్డి కనుసన్నల్లోనే!

by Disha Web Desk 2 |
సబ్ కాంట్రాక్టర్లంతా గులాబీ లీడర్లే.. నిర్మాణాలన్నీ గణపతి‌రెడ్డి కనుసన్నల్లోనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నూతన సెక్రటేరియట్, పోలీసు టవర్స్, ప్రగతిభవన్, అమర‌జ్యోతి, జిల్లాల్లో కలెక్టరేట్ల నాణ్యత, నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత? పని పూర్తయేసరికి ఎంత పెరిగింది? అందుకు గల కారణాలేంటి? అనే కోణంలో ఆర్ అండ్ బీ అధికారుల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విచ్చలవిడిగా అంచనా వ్యయాన్ని పెంచి, అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా అనుకున్న అంచనా వ్యయంలోనే నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదు? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నది. అవసరాలకు తగ్గట్టుగానే అంచనాలను పెంచారా? లేక ఇష్టానుసారంగా పెంచారా? అనే వివరాలను సేకరిస్తున్నది. ప్రధానంగా అంచనాల పెంచడం వెనుక ఉన్న అధికారులు ఎవరు? ఆ ఫైల్ పై సంతకాలు చేసిన ఆఫీసర్లు ఎవరు? ఎవరైనా డిసెంట్ నోట్ రాశారా? అంచనాల పెంపు విషయంలో సెకండ్ పార్టీ ఒపినియన్ తీసుకున్నారా? అనే అంశాలను రాబట్టడంలో ప్రభుత్వం లీనమైనట్టు సమాచారం.

గులాబీ లీడర్లే సబ్ కాంట్రాక్టర్లు

సెక్రటేరియట్, ప్రగతిభవన్, కలెక్టరేట్స్, పోలీసు టవర్స్, అమరజ్యోతి నిర్మాణ పనులన్నీ గులాబీ లీడర్లకు చెందిన సంస్థలే సబ్ కాంట్రాక్టు పేరుతో చేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి సంస్థల ద్వారానే ఇసుక, సిమెంట్, లేబర్, స్టీల్ సరఫరా చేసినట్టు ప్రభుత్వం గుర్తించినందన్న ప్రచారం జరుగుతున్నది. సదరు కంపెనీలు ఏ స్థాయి లీడర్లకు చెందినవోననే విషయాలపై సర్కారు ఆరా తీస్తున్నది. అలాగే ఫర్నీచర్, నెట్ వర్కింగ్, ఎలక్ట్రికల్ పనులను సైతం బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలే చేసినట్టు సమాచారం.

గణపతి‌రెడ్డి కీలకం!

బీఆర్ఎస్ హయంలో చేపట్టిన నిర్మాణాల్లో ఈఎన్సీ గణపతి‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని టాక్. ముగ్గు పోసినప్పటి నుంచి, ప్రారంభోత్సవం వరకు అన్ని పనులను ఆయన కనుసన్నల్లోనే జరిగాయనే టాక్ ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన పదవి కాలాన్ని నాటి ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఆయన అదే హోదాలో కొనసాగుతున్నారు. అంచనాలు పెంపు విషయంలో ఆయన నుంచి పూర్తి వివరాలను రాబట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. వాస్తవానికి గణపతి రెడ్డి రోడ్డు విభాగంలో ఎక్కువ కాలం పనిచేశారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను బిల్డింగ్ విభాగానికి ఈఎన్సీగా నియమించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.



Next Story

Most Viewed