కవిత బీజేపీ వదిలిన బాణం

by velandi.Saikiran |

కవిత బీజేపీ వదిలిన బాణం
X

* లేడీ మాఫియా డాన్ కవిత

* కవితకి బీజేపీ సహకారం అవసరం

* మీడియాతో మధుయాష్కి గౌడ్ చిట్​చాట్​

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత బీజేపీ వదిలిన బాణం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ సభ్యులు మధుయాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు. కవిత లేడీ మాఫియా డాన్ అని, ఆమె చేయని దందా, స్కాం లేదని ఘాటుగా విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మధుయాష్కి గౌడ్ మీడియాతో చిట్​చాట్​చేశారు. ఈసందర్భంగా ఆయన ఎమ్మెల్సీ కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ పేరుతో కవిత బతుకనేర్చిందని.. కేసుల నుండి బయట పడాలంటే కవితకి బీజేపీ సహకారం అవసరం ఉందన్నారు. తాగుడు వల్ల ఆడబిడ్డల పుస్తేలతాడులు తెగుతున్నాయని అన్నారు. కవిత అనేక స్కాములు చేసిందని.. జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామి ఉందన్నారు. జాగృతి సంస్థ అవినీతి సంస్థ అని ఆ సంస్థ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజీవ్ ప్రతాప్ కేంద్రమంత్రిగా స్కిల్ డెవలప్ చేస్తామని 800 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. జాగృతి కోసం ఫీనిక్స్ లాంటి సంస్థల నుండి డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

కేసీఆర్ కవితకి పిత, తెలంగాణకి పిశాచి అని ఎద్దేవా చేశారు. జై తెలంగాణ అని పిడికిలి బిగించి దోచుకున్నది కేసీఆర్ ఫ్యామిలీ కదా అని ప్రశ్నించారు. కవిత ఏ వ్యాపారం చేసిందని కోట్ల రూపాయలు సంపాదించిందన్నారు. అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవడానికే కవిత జాగృతిని బలోపేతం చేస్తోందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకే కవిత పనిచేస్తోందన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే బిసి నినాదం ఎత్తుకుందన్నారు. బీసీల కోసం మాట్లాడుతున్న కవిత జాగృతిని బీసీల చేతిలో పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ సాధన కాదని... తెలంగాణకి ముఖ్యమంత్రి కావడమే అని అన్నారు. తనని ముఖ్యమంత్రిని చేస్తే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియాకి చెప్పాడని గుర్తు చేశారు.

చెట్ల సంతోష్ ఇప్పుడు చెట్లను ఎందుకు నాటడం లేదని ప్రశ్నించారు. అమెరికా, దుబాయ్ లలో కేటీఆర్, కవితలకి పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఇన్వెస్ట్మెంట్ చూసుకోవడానికే కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ మొహంజాహీ మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకునే వాళ్ళని అన్నారు. తెలంగాణ రాకపోతే కవిత ఏపీలో బ్యూటీ పార్లర్ పెట్టుకునేదని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ జెండా కూడా ఎగరేయలేదని విమర్శించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూడా భాగస్వామి అని, లిక్కర్ స్కాం చర్చలు ప్రగతి భవన్ లోనే జరిగాయని అని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

Next Story