- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ పవర్స్ అన్నారే కానీ.. అమలు ఎక్కడ? డీసీసీ అధ్యక్షుల అసంతృప్తి
అంతన్నాడు ఇంతన్నాడే.. గంగరాజు.. సినిమాలో ఒక పాట ఉంది.. తమ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని.. తమ పరిస్థితికి ఈ పాట అర్ధం సరిపోతుందని అంటున్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు.

దిశ, తెలంగాణ బ్యూరో : అంతన్నాడు ఇంతన్నాడే.. గంగరాజు.. సినిమాలో ఒక పాట ఉంది.. తమ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని.. తమ పరిస్థితికి ఈ పాట అర్ధం సరిపోతుందని అంటున్నారు జిల్లా కాంగ్రెస్కమిటీ (డీసీసీ) అధ్యక్షులు. తమకు పది రోజుల పాటు అనంతగిరి లో శిక్షణ ఇచ్చి... ఏదో ఏదో చెప్పారని... మునగ చెట్టు ఎక్కించారని, కానీ క్షేత్ర స్థాయికి పోయే సరికి పరిస్థితి మాత్రం రివర్స్లో ఉందని అంటున్నారు వారు. ఏకంగా రాహుల్ గాంధీ కూడా వచ్చి తమతో మాట్లాడారని, తమ కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్షుల తరువాతనే ఏవరైనా అన్నారని, ఫుల్ పవర్స్ ఉంటాయి, పార్టీకి సంబంధించిన పనులన్ని మీ ద్వారానే చేస్తాం, మీరు అభ్యర్థులను నిర్ణయిస్తారు, నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు, మీరు ఇచ్చే నివేదికలు కీలకంగా ఉంటాయని ఇలా ఎన్నో చెప్పారని కానీ అచరణలో మాత్రం అందుకు విరుద్దంగా ఉందని డీసీసీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న డీసీసీ అధ్యక్షులు వారు నియమితులైన తరువాత వికారాబాద్ అనంతగిరి అడవుల్లో పది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. దీంతో వారికి గెట్ టు గెదర్ ను గురువారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ గెటు టు గెదర్కు అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు హాజరు కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఇరువురు హాజరయ్యారు. ఈ సమావేశం చాలా హాట్ గా సాగిందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు తమ ఆవేదనను అంతా వెళ్లగక్కినట్లుగా తెలిసింది.
ఒక్కొప్రాంతానికి చెందిన ఒక్కొ డీసీసీ అధ్యక్షులు ఒక్కొ రకమైన సమస్యను పీసీసీ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి ల ముందు ఉంచినట్లుగా తెలిసింది. తమకు వికారాబాద్ శిక్షణ తరగతుల సమయంలో చెప్పిన ఒక్క మాట అమలు కావడంలేదని, అప్పుడు తమను మునగ చెట్టి ఎక్కించారని, ఏకంగా రాహుల్ గాందీ కూడా డీసీసీ ఫుల్ వపర్స్ ఉంటాయని చెప్పారని, తాము ఎంతో సంతోషించామని, కానీ అవి ఎక్కడ అమలు కావడంలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులదే నిర్ణయ అధికారాలు ఉంటున్నాయని వారు చెప్పినట్లుగా సమాచారం. తాము సూచించిన ఏవ్వరికి సర్పంచ్,మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేదని, పేర్లు రాయని బీ ఫాంలపై సంతకాలు చేయించుకుంటున్నారని, పార్టీ నివేదికలపై సంతకాలు చేయించుకుంటున్నారని, తాము కేవలం సంతకాలు చేయడానికి మాత్రమే ఉన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీ కమిటీలను కూడా స్థానిక శాసనసభ్యులు, ఓడిపోయిన అభ్యర్థులే వేస్తున్నారని, తాము పోటీ అవుతామని, తమను ముందు నుంచేకట్టడి చేయడానికి వారుప్రయత్నిస్తున్నారని, స్థానిక మంత్రులు, శాసనసభ్యులు, ఓడిపోయిన వారు ఏ మాత్రం సహకరించడంలేదని, సహాయనిరాకరణ చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. తమను పనిచేయ్యనివ్వడంలేదని, గ్రూపులు, వర్గాలుగా ఉన్నారని, దీంతో తాము ఏం చేయాలో అర్ధం కావడంలేదని కొన్ని జిల్లాల అధ్యక్షులు చెప్పినట్లుగా తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులను పార్టీ సమావేశాలకు హాజరు కానివ్వడంలేదని, వారి నియోజకవర్గాల్లో తమకు ఎంట్రి లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ్యులపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి నెలా మంత్రులు, శాసనసభ్యులు, ఇంఛార్జిలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇస్తామని, అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే విధంగా ఆదేశాలు ఇస్తామని పీసీసీ చీఫ్ తెలిపినట్లుగా సమాచారం.
తమకు జిల్లాలో తిరిగినప్పుడు ప్రొటోకాల్ సమస్య వస్తుందని, చిన్న అధికారితో కూడా మాట్లాడలేకపోతున్నామని, అధికార పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వారు పట్టించుకునే పరిస్థితి లేదని, వారు స్పందించడంలేదని, సీఎం జిల్లాకు వచ్చినప్పుడు స్టేజీ మీద కూర్చునే విధంగా తమకు ప్రోటోకాల్ ఉండే నామినెటెడ్ పోస్టులు ఇవ్వాలని వారు కోరినట్లుగా తెలిసింది. దీనిలో ప్రధానంగా ఖాళీగా ఉన్న డీసీసీబీ చైర్మన్ పదవులు ఇవ్వాలని, వాటికి అవకాశం లేని వారికి ఇతర పోస్టులు ఇవ్వాలని కోరారని సమాచారం. జిల్లా ఇంఛార్జి మంత్రి తాము సూచించే వారికి పనులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే విధంగా, ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకుంటే తమకు సమాచారం అందించే విధంగా మంత్రులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుందని, అయితే వీటన్నంటిని నిర్వహణకు, పార్టీ కార్యాలయ నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని, రాష్ట్ర పార్టీ నుంచి కొంత మొత్తాన్ని ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. ఆర్థికంగా కొంత వరకు భరించగలుగుతున్నారని, కానీ కొన్ని జిల్లాల అధ్యక్షుల పరిస్థితిని వారు చెప్పుకున్నట్లుగా తెలిసింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు కూడా భరోసా ఇచ్చినట్లుగా తెలిసింది. జిల్లాల్లో పార్టీ కార్యలాయాలు లేని చోట్ల స్థలాలు చూడాలని, వాటినిప్రభుత్వ పరంగా కేటాయించి కొత్త భవనాలను నిర్మించుకుందామని, దానికి డిజైన్ కూడా ఖరారు చేయించి ఇస్తామని చెప్పారని తెలిసింది.
అయితే వీరి అగ్రహాన్ని, అసంతృప్తిని గ్రహించిన పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలు వారిని సముదాయించినట్లుగా తెలిసింది. రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, ఏఐసీసీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుందని, గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి టిక్కోట్లు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేసినట్లుగా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఇస్తారని, నామినెటెడ్ పోస్టులను డీసీసీ అధ్యక్షులను ఇవ్వాలనే విషయం తమ ప్రతిపాదనలో ఉందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వారి చెప్పినట్లుగా తెలిసింది. 33 శాతం మహిళలకు సీట్లు ఇస్తామని, అదే సమయంలో శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులతో వివాదాలు వద్దని సూచించినట్లుగా తెలిసింది.






