రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయండి.. గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

by Disha Web Desk 2 |
రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయండి.. గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ తమిళిసైకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కార్పొరేషన్ లోన్లు తదితర స్కీముల్లో స్వయంగా సర్కారే స్కామ్​చేస్తుందని ఆరోపించారు. కమీషన్ల పేరిట దోపిడీ చేస్తున్నట్లు వివరించారు. దళితబంధులో సొంత పార్టీ ఎమ్మెల్యేలే డబ్బులు నొక్కేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. స్వయంగా సీఎం అంగీకరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. దళితబంధు పథకం డబ్బుల విషయంలో కొందరు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సమాచారం ఉన్నదని సీఎం చెప్పి చర్యలు తీసుకోకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. అంటే కేసీఆర్​అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు అర్థం అవుతుందన్నారు.

కేసీఆర్​ ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని, వెంటనే రాష్ట్రపతి పాలనకు ఆదేశాలివ్వాలని జడ్సన్​గవర్నర్‌ను కోరారు. కేసీఆర్​పాలనలో పేదలకు అన్యాయం జరుగుతుందని, అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గతంలో రాష్ట్రపతి కూడా వినతి పత్రాన్ని ఇచ్చినట్లు జడ్సన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్​పూర్తిగా క్షీణించిందన్నారు. పట్టపగలు అడ్వకేట్ దంపతులు వామన్ రావు హత్యలు, మర్యామ్మ, రంగయ్య, ఖదీర్, ఇటీవల తుక్కారం గేట్ పోలీస్ స్టేషన్లో చిరంజీవి లాకప్ డెత్‌‌లు కొనసాగుతూనేఉన్నాయన్నారు. మరోవైపు రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్, కేటీఆర్, కవితలు ఆస్తులు పెంచుకున్నారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం అప్పులు, ధరణి భూ కుంభకోణం, రైతుల ఆత్మహత్యలు, లిక్కర్ స్కామ్, గ్రూప్-1 ప్రశ్న పత్రాల లీకులు తదితర తప్పులు చేస్తూ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందన్నారు.

Next Story