శుభవార్త వెనుక చిన్న మెలిక.. కేసీఆర్‌పై ఆదివాసీల ఆగ్రహం!

by Disha Web Desk 2 |
శుభవార్త వెనుక చిన్న మెలిక.. కేసీఆర్‌పై ఆదివాసీల ఆగ్రహం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీనే టార్గెట్‌గా సీఎం కేసీఆర్ విమర్శల తీవ్ర పెంచారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదని ఇక్కడి ప్రజల కోసం తానే కృషి చేస్తున్నానంటూ మరోసారి తననే ఆదరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో శనివారం కేసీఆర్ చేసిన సంచలన ప్రకటనపై అప్పుడే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి గిరిజన బిడ్డలకు శుభవార్త చెప్పారు. ఆ గుడ్ న్యూస్ వెనుక చిన్న మెలిక పెట్టడం ఆ వర్గం ప్రజలు కేసీఆర్‌పై ఆగ్రహానికి కారణం అవుతోంది. ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తూ పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపిస్తామని చెప్పారు. పోడు భూములు పంచే విషయంలో లిస్ట్ రూపొందిస్తున్నారమని, ఆ భూములు పంచిన తర్వాత అసలు భూములు లేని గిరిజనుల లెక్క తేలుద్దామ్నారు. ఆ లెక్కల ప్రకారం భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధు అమలు చేస్తామని ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభిస్తానని సగర్వంగా ప్రకటించారు. దళిత బంధు మాదిరిగా గిరిజన బంధును అమలు చేస్తానన్న కేసీఆర్ తన ప్రకటనలో భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధు ఇస్తామని చెప్పడంపై గందరగోళం ఏర్పడింది.

సోషల్ మీడియాలో విమర్శలు:

కేసీఆర్ ప్రకటనపై గిరిజన వర్గాల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా దళితబంధు అమలు చేస్తున్నప్పుడు మరి గిరిజన బంధును ఎందుకు అమలు చేయరని ప్రశ్నిస్తున్నారు. నిజానికి దళితుల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సైతం దళితబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలో స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు పంచుతానన్న కేసీఆర్ తీరుపై గతంలో విమర్శలు వచ్చాయి. కానీ, ఆయన మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న దళిత బంధు స్కీమ్‌లో ఎందరో రాజకీయ నాయకులు, వారి బంధువులు లబ్ధి పొందుతుండటం వల్ల అసలైన అర్హులకు పథకం రాకుండా పోతోందనే విమర్శలు ఆయా జిల్లాల్లో వినిపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్ గిరిజన బంధును భూమిలేని వారికి మాత్రమే అనేలా ప్రకటన చేయడం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇదెక్కడి ద్వంద్వ వైఖరి అంటూ మండిపడుతున్నారు. ఒకే తరహా పథకం ఒక వర్గానికి ఒకలా మరో వర్గానికి మరోలా అమలు చేస్తామనడం ఎంతవరకు సబబు అని మండిపడుతున్నారు.

కేసీఆర్‌లో గందరగోళం?

గిరిజనబంధు ప్రకటన చేస్తున్న ప్రసంగంలోనే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోంది తప్ప ప్రజా సమస్యలను, రాష్ట్రాల అభ్యర్థనలను ఖాతరు చేయడం లేదని మండిపడ్డారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ తూర్పారబట్టారు. అయితే తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ ప్రసంగంలో ప్రతిష్టాత్మకమైన గిరిజనబంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించేశారు. ఈ సమయంలో ఆయన గందరగోళానికి గురై ఇలా లిమిటేషన్స్ చెప్పారా లేక గిరిజన బంధు విషయంలో నిజంగానే ఆంక్షలు ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో కొంత మంది స్పందిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు దళిత బంధుకే మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఇక గిరిజన బంధు పేరుతో వారిని సైతం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. ఇక కేసీఆర్ హడాహుడిగా చేసిన గిరిజన బంధు ప్రకటన వెకున మునుగోడు ఉపఎన్నికలో గెలవడమే ముఖ్య ఉద్దేశమనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఇంటెన్షన్ ఎలా ఉన్నా గిరిజన బంధు ఎవరెవరికి అమలు చేస్తామనే విషయంపై ప్రభుత్వమే ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed