జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్ కీలక హామీ

by Disha Web Desk 14 |
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్ కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీయిచ్చారు. ఈ మేరకు ఆదివారం డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షుడు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఈ విషయంపై సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ చర్చించాలని డీజేహెచ్‌ఎస్‌ ప్రతినిధులకు సూచించారు. అనంతరం తాము జర్నలిస్టులకు ఎలా ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని ఎన్నికల సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని (రేవంత్‌రెడ్డి) కలిసి విన్నవించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం తెలంగాణ ప్రాంత జర్నలిస్టులతో ఏర్పాటైన ఏకైక సొసైటీ ‘డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజీహెచ్‌ఎస్‌)’ అని సీఎంకు విన్నవించారు. ఈ సొసైటీలో ఐదు వందల మందికి పైగా సభ్యులున్నారన్నారు. వీరంతా వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానెళ్లలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్టాఫ్‌ రిపోర్టర్, సబ్‌ ఎడిటర్‌ నుంచి బ్యూరో చీఫ్‌లు, న్యూస్‌ ఎడిటర్, అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆపై స్థాయిలో హైదరాబాద్‌ కేంద్రంగా దశాబ్దాలుగా పనిచేస్తున్నారని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు. డీజేహెచ్‌ఎస్‌లో వర్కింగ్‌ జర్నలిస్టులుగా పనిచేస్తున్న అందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీఎంకు విన్నవించారు.

Next Story

Most Viewed