ఎలివేటేడ్ కారిడార్లకు లైన్​క్లియర్.. కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన CM రేవంత్

by Disha Web Desk 19 |
ఎలివేటేడ్ కారిడార్లకు లైన్​క్లియర్.. కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన CM రేవంత్
X

దిశ, సిటీ బ్యూరో: ఎలివేటెడ్ కారిడార్లకు ఎట్టకేలకు కొత్త సర్కారు హయాంలో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించిన నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. హైదరాబాద్‌‌ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు, హైదరాబాద్– నాగ్ పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతివ్వటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరుతూ లేఖ రాసిన సంగతి తెల్సిందే.

సీఎం లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అధికారికంగా అనుమతులు కూడా జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటం పట్ల సీఎం రేవంత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు.

కారిడార్లు.. స్థలాలు

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండంను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్షన్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.3 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని సమర్పించిన లేఖలో సీఎం పేర్కొన్నారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44) కండ్లకోయ కారిడార్‌కు సంబంధించిన ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.3 కిలోమీటర్ల కారిడార్‌ను ప్రతిపాదించగా, అందులో 12.6 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భవిష్యత్తులో డ‌బుల్ డక్కర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ఆ శాఖ మంత్రికి సీఎంరేవంత్ తన లేఖలో వివరించారు.

కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్యకై పరిష్కారం సమకూరింది. హైదరాబాద్ నుంచి శామీర్ పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ అభివృద్ది పరుగులు తీయనుంది. కేంద్ర సానుకూల నిర్ణయంతో జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల బదలాయింపుకు అన్ని రకాల అడ్డంకులు తొలిగిపోయాయి. గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకార పూరిత వైఖరితోనే ఏళ్ల నుంచి ఎలివేటేడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచిపోయిందన్న విమర్శలుండేవి.

ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ రాష్టానికి సాధించుకోవాల్సిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి లేఖలు అందించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలేవైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని సీఎం మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Read More..

ప్రభుత్వ కీలక పదవుల్లో 25 మంది ప్రైవేట్ రంగ నిపుణుల నియామకం

Next Story

Most Viewed