CM Revanth Reddy: గేట్ వే అఫ్ హైదరాబాద్ గా ఆ ప్రాంతం.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

by Prasad Jukanti |

హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.

CM Revanth Reddy: గేట్ వే అఫ్ హైదరాబాద్ గా ఆ ప్రాంతం.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను అదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్ వే అఫ్ హైదరాబాద్ (Gateway of Hyderabad) నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్ కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి మరోవైపున బాపూ ఘాట్ వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని.. అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం అదేశించారు. ఓఆర్ఆర్ కు ఒక వైపున ఉండే ఎకో థీమ్ పార్క్.. మరో వైపున నిర్మించే ఐకానిక్ టవర్ కు చేరుకునేందుకు ప్రయాణాలకు వీలుగా ఎలివేటెడ్ గేట్ వే నిర్మించి దాన్ని గేట్ వే అఫ్ హైదరాబాద్ గా డిజైన్ చేయాలని సీఎం అదేశించారు.

ప్రపంచంలోనే ఎత్తైన టవర్ గా ఐకానిక్ టవర్:

బాపూఘాట్ చుట్టూ ఉన్న ఏరియా ను వరల్డ్ క్లాస్ జోన్ గా అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని సూచించారు. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని, గాంధీ సరోవర్ చుట్టూ ఈ ప్లైఓవర్ కనెక్టివ్ కారిడార్ లా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్ కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ (Iconic Tower Hyderabad) ప్రపంచంలోనే ఎత్తైన టవర్ గా నిర్మించాలని సీఎం సూచించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఎత్తున నిర్మించాలనేది అంచనాకు రావాలని సీఎం సూచించారు.

రెండు నెలల్లో టెండర్లు:

తాగు నీటితో పాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఉండాలని, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టు నమూనాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగు నీటిని హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ప్లానింగ్ చేయాలన్నారు. స్థలం వృథా కాకుండా మూసీ పరివాహక ప్రాంతం ఇరువైపులా అండర్ గ్రౌండ్ లో భారీగా వాటర్ స్టోరేజ్ సంప్ నిర్మించే సదుపాయాలు.. అక్కడి నుంచి వాటర్ ట్రాన్స్ పోర్ట్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గాంధీ సరోవర్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు.

Next Story