CM Revanth: రైతు రాజు కావాలంటే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి

by Gantepaka Srikanth |

తెలంగాణలో రైతులకు అండగా ఉంటూ వారికి సంబంధించిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన గురుతరమైన బాధ్యత లైసెన్స్ పొందిన సర్వేయర్లపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు.

CM Revanth: రైతు రాజు కావాలంటే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతులకు అండగా ఉంటూ వారికి సంబంధించిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన గురుతరమైన బాధ్యత లైసెన్స్ పొందిన సర్వేయర్లపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. లైసెన్స్ పొందిన సర్వేయర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలవాలి. రైతు రాజు కావాలంటే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. రైతుకు అన్యాయం చేస్తే మన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినట్టే. మీరంతా కష్టపడితే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరొస్తుంది. ఆ గురుతరమైన బాధ్యత మీ భుజస్కందాలపై పెట్టి గ్రామాలకు, తండాలకు పంపిస్తున్నాం.

రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 1 కోటి 60 లక్షల ఎకరాల భూములు యజమానుల వద్ద ఉంది. 140 సంవత్సరాలుగా వివిధ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం లభించలేదు. సరిహద్దుల విషయంలో ఏ రైతు కూడా పరిష్కారం కాకుండా ఇబ్బంది పడొద్దని మిమ్మల్ని నియమించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు కన్న తల్లిపై ఎంత మమకారం చూపిస్తారో గ్రామంలో తమ భూమి మీద అదే మమకారం చూపిస్తారు. భూ యజమానుల సరిహద్దులను పరిరక్షించే బాధ్యత మీపై పెట్టాం. దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి మీరంతా సహకరించాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు వెళుతున్నాం. మీరంతా విజన్‌లో భాగస్వాములు కావాలి. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యం చేరుకోవాలంటే మీ సహకారం ఉండాలి" అని కోరారు.

Next Story