5 లక్షల మందికి ఉద్యోగాలు.. CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
5 లక్షల మందికి ఉద్యోగాలు.. CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సిటీకి సమీపంలో త్వరలోనే సెకండ్ ఫేజ్ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాథమికంగా సుమారు 300 ఎకరాల్లో రూ. 2000 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించనున్నామని, చివరకు లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దాదాపు ఐదు లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్‌లు వస్తాయన్నారు. హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా సదస్సును హైటెక్స్ లో మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పై స్పష్టత ఇచ్చారు.


జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజాను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయనకు అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయో ఏషియా సదస్సు కీలకంగా మారిందన్నారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని అన్నారు. వైరస్ భయాలను దీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్న అంశాన్ని గుర్తుచేశారు.

ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరికీ సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందని, అయితే వాటికి పరిష్కారాలను కూడా మనం కలిసికట్టుగానే సాధించాలని సీఎం సూచించారు. ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకూ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్‌లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.

"మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్‌లా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది" అని సీఎం వ్యాఖ్యానించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ఏటా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తే లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ ఇక్కడి బయోలాజికల్-ఈ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పడాన్ని సీఎం స్వాగతించారు. వైరస్‌ల వల్ల ప్రపంచంలో నెలకొన్న భయాలకు హైదరాబాద్ నుంచి నమ్మకాన్ని కల్పిస్తున్నామని సీఎం అన్నారు. జర్మనీకి చెందిన మిల్టేనీ సంస్థ తన రీసెర్చ్ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసిందన్నారు.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోనే ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. మానవాళికి మంచి చేసే చర్చలు, ముందడుగుతో హైదరాబాద్ బయో ఏషియా సదస్సు విజయవంతం కావాలని సీఎం ఆకాంక్షించారు.

Next Story

Most Viewed