మేడిగడ్డ ప్రాజెక్టు‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 14 |
మేడిగడ్డ ప్రాజెక్టు‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులకు పనికి రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఎం కేసీఆర్ ధన దాహానికి బలైందని ఆరోపించారు. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి.. 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని స్పష్టంచేశారు.

ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదని తెలిపారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల మంగళవారం మేడిగడ్డ పర్యటన అని పేర్కొన్నారు.మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించామని, బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు.

కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదన్నారు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒక వైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయన్నారు. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందని ఆసక్తికర ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed