వారికే నామినేటెడ్ పదవులు.. ఫస్ట్ లిస్టులో18 మందికి పదవులు

by Disha Web Desk 2 |
వారికే నామినేటెడ్ పదవులు.. ఫస్ట్ లిస్టులో18 మందికి పదవులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చేందుకు కృషి చేసిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సీఎం మొదలు పెట్టారు. ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంక్ ను కల్పిస్తూ అడ్వైజర్ పోస్టులు ఇవ్వగా, త్వరలో మరో 18 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు. ఫస్ట్ లిస్టులో కార్పొరేషన్ చైర్మన్‌లుగా ప్రకటించనున్నారు. సోమవారం సీఎం ఈ లిస్టును పరిశీలించిన తర్వాత ఢిల్లీకి సమాచారం పంపనున్నారు.

అక్కడ్నుంచి క్లియరెన్స్ రాగానే ప్రకటించే ఛాన్స్ ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులతో పాటు క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. ప్రాధాన్యత క్రమంలో పేర్లను వెల్లడించనున్నారు. త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో మైలేజ్ పొందేలా నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు. ఇందుకోసం పార్టీ కసరత్తు చేస్తున్నది. పార్టీలో అసంతృప్తి రాగం వినిపించకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. టీపీసీసీ, ఏఐసీసీ సమన్వయంతో పోస్టులు కేటాయించనున్నారు.

కష్టపడి పనిచేసిన వారికే..

మొదట్నుంచి పార్టీ కోసం కృషి చేసిన అద్దంకి దయాకర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీ.హనుమంతరావు, సామ రామ్మోహన్ రెడ్డి, రాములు నాయక్, మల్లాది పవన్, చిన్నారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పున్నా కైలాస్ నేత, బైకాని లింగం యాదవ్, కాల్వ సుజాత, రియాజ్, శివసేనారెడ్డి, అన్వేష్ రెడ్డి, ప్రీతమ్, బెల్లయ్య నాయక్, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, ముత్తినేని వీరయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, చరణ్​కౌశిక్, బాలలక్ష్మీ, తీన్మార్ మల్లన్న పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్లు, మరి కొందరికి ఇతర పదవులు ఇవ్వాలని పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు పొంది ఓడిపోయిన మధుయాష్కీ గౌడ్, ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పోదెం వీరయ్య, సునీతరావ్, సంపత్ కుమార్ లకు కూడా ప్రాధాన్యత కల్పించాలని భావనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.

Next Story

Most Viewed