అసెంబ్లీలో రేవంత్ రెడ్డి vs అక్బరుద్దీన్.. తీవ్రరూపం దాల్చిన మాటల యుద్ధం

by Disha Web Desk 2 |
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి vs అక్బరుద్దీన్.. తీవ్రరూపం దాల్చిన మాటల యుద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య వాగ్వాదం జరిగింది. విద్యుత్ రంగంపై గురువారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ నడుమ డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ ముస్లింల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. అక్బరుద్దీన్ మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే అని ఆయన ముస్లిం అందరికీ నాయకడు కాదు అన్నారు. అక్బురుద్దీన్ ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదని చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఓటు వేస్తేనే ఆయన గెలిచారన్నారు. అంతకు ముందు అక్భరుద్దీన్ మాట్లాడుతూ తలసరి విద్యుత్ వినయోగంలో తెలంగాణ దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానిని నెరవేర్చాలన్నారు.

ఓల్డ్ సిటీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలుగజేసుకుని తన ప్రాంతంలో ఉన్న విద్యుత్ సమస్యలపై అక్బరుద్దీన్ ఓవైసీ గత ప్రభుత్వాన్ని అడగలేదని అన్నారు. దీంతో కవ్వంపల్లి వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ స్పందిస్తూ కవ్వంపల్లి బచ్చా అన్నారు. అతను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. దీంతో స్పందించిన సీఎం అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేను, దళిత ఎమ్మెల్యేను గౌరవించాలన్నారు. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అన్న తేడాలేదని అక్బరుద్దీనే తన మిత్రుడు కేసీఆర్‌ను కాపాడేందుకు పదే పదే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వంలో ఎంఐఎం కూడా భాగస్వామ్యంగా ఉందని, ఆ ప్రభుత్వంలో తప్పులకు ఎంఐఎం బాధ్యత కూడా ఉంటుందన్నారు. విద్యుత్ బకాయిలలో గజ్వేల్, సిద్ధిపేట, హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఈ ప్రాంతాలలో విద్యుత్ బకాయిలు రాబట్టి విద్యుత్ సంస్థలను నష్టాల ఊబినుంచి పైకి తెచ్చేందుకు అక్బరుద్దీన్ సహకరించాలన్నారు. అంతే తప్ప బీఆర్ఎస్ ను ఎంఐఎం పొగడ్తలతో ముంచెత్తుతుంటే కూర్చొని వినడానికి తాము సిద్ధంగా లేమని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed