- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో సోమవారం లోక్ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో సోమవారం లోక్ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ప్రతిజ్ఞ, కిట్ల పంపిణీ కార్యక్రమ సభకు శివ్ ప్రతాప్ శుక్లాను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. విద్యార్థులు పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ప్రవర్తించాలని ఆ సభలో విద్యార్థులతో ప్రభుత్వం సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి గతంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సూచించారు. గవర్నర్ సూచనను గౌరవిస్తు విద్యార్థులతో భారీ సభ ఏర్పాటు చేసి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించనున్న రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామని, ఆ కిట్లలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, క్రీడా దుస్తులు, విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి ఉంటాయని గవర్నర్కు సీఎం తెలియజేశారు.
తమ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంచేలా యాజమాన్యాలు ప్రకటిస్తాయని రేవంత్ రెడ్డి ఆయనకు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలను నిర్వహించానున్నారు. విద్యా సంస్థలను సురక్షితం, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల సమష్టి బాధ్యతపై అవగాహన కల్పించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమని గవర్నర్ కి సీఎం వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలనార్ధం ముందుగానే పంపుతామని గవర్నర్కు రేవంత్ రెడ్డి తెలిపారు.






