స్పాట్‍లోనే సస్పెండ్ చేస్తా.. అధికారుల పని తీరుపై రేవంత్ రెడ్డి సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2026-02-17 11:25:49  IST  )

విధుల్లో అలసత్వం వహిస్తే స్టాట్‍లోనే సస్పెండ్ చేస్తానని సీఎం హెచ్చరించారు. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని ప్రకటించారు.

స్పాట్‍లోనే సస్పెండ్ చేస్తా.. అధికారుల పని తీరుపై రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: చాలా మంది అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లడం లేదని మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయ్యారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం ఫీల్డ్‌లో ఉండాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జీహెచ్‍ఎంసీ (GHMC) విభజన తలెత్తిన పలు సమస్య పరిష్కారానికి సీఎం సూచనలు చేశారు. మూడు కార్పొరేషన్‍లలో శానిటేషన్‍పై ప్రత్యేక దృష్టి సారించాలని, త్వరలో ప్రతి జోన్‍లో పర్యటిస్తానని రోడ్లులు శుభ్రం లేకపోతే అక్కడిక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలు..

హైదరాబాద్ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని, ట్రాఫిక్ బాగా ఉన్నచోట పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిల (Skywalk PPP Model) ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడ్వర్టైజింగ్ బోర్డుల ఏర్పాటుపైనా జాగ్రత తీసుకోవాలని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం ప్రకటన బోర్డులు కేటాయించాలన్నారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒకసారి ఫీజు వసూలు చేయాలని, అనధికార బోర్డులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాటి నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, జంక్షన్‍ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్క్‌ల వివరాలు సేకరించాలని సూచించారు.

నూతన మేయర్, చైర్మన్లకు శిక్షణ..

రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

TG: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. వివరాలు వెల్లడించిన శ్రీధర్ బాబు

Next Story