విభేదాలు వద్దు.. పార్టీ విజయం ముఖ్యం

by Disha Web Desk 2 |
విభేదాలు వద్దు.. పార్టీ విజయం ముఖ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్, వరంగల్ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కీలక నేతలకు సూచించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థులు, కీలక నేతలతో రివ్యూ నిర్వహించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. కొత్త, పాత విభేధాలు లేకుండా పనిచేయాలన్నారు. పార్టీ విజయం కోసం నేతలంతా సమన్వయంతో పనిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలవాల్సి ఉండగా, ఈ రెండు సెగ్మెంట్‌లు ఆ జాబితాలో ఉండాలన్నారు.


ఎక్కడికక్కడ బూత్ కమిటీలను మండల నుంచి జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కమిటీలోని కీలక సభ్యులంతా ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకొని, ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేయాలన్నారు. ఇక కంటోన్మెంట్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆ సెగ్మెంట్ నేతలకు సీఎం సూచించారు. వేర్వేరుగా జరిగిన ఈ మీటింగ్‌లకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed