1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది: సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది: సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ దగ్గర తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం సెక్రటేరియట్‌ వద్దకు చేరుకొని జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష ఆర్థికసాయం చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపడుతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని కీలక వ్యాఖ్యలు చేశారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తుచేశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమం శాంతియుతంగా జరిగిందని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని దేశంలో తెలంగాణ బలమైన శక్తిగా ఎదిగిందని అన్నారు. రాష్ట్రంలో ఏ పథకం తీసుకొచ్చినా దాని వెనుక మానవీయ కోణమే ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతీ పల్లె నేడు కళకళలాడుతోందని అన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు నేడు పచ్చని పంటలతో సస్యశ్యామలం అయిందని అన్నారు. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవరించిందని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తంగా అమలు కావాలని కోరుకున్నారు.

Read More... బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం: Bandi Sanjay Kumar



Next Story

Most Viewed