సిట్టింగ్‌ ఎమ్మెల్యేల కదలికలపై సీఎం కేసీఆర్ నిఘా!

by Disha Web Desk 2 |
సిట్టింగ్‌ ఎమ్మెల్యేల కదలికలపై సీఎం కేసీఆర్ నిఘా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు.. జారిపోయేదెవరు.. విపక్షాల ఉచ్చులో చిక్కుకునేదెవరు... ఆఫర్ల ప్రలోభాలకు లొంగుతున్నారా?.. అని సిట్టింగ్‌ల కదలికలపై కేసీఆర్ నిఘా పెట్టారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే చేజారిపోతారా? అనే వివరాలు సైతం సేకరిస్తున్నారు. ఊగిసలాటలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేదానిపై డేటా తెప్పించుకుంటున్నారు. ఇటీవల వచ్చిన విపక్షాల పిలుపులపై ఆరా తీస్తున్న కేసీఆర్ వచ్చే నెల నుంచి సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ఆయా నేతలపై ఆరా...

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో గులాబీ ఎమ్మెల్యేలు టికెట్ వస్తుందా? రాదా? అనే ఊగిసలాటలో ఉన్నారు. అలాంటి నేతలపై విపక్షాలు ఫోకస్ పెట్టాయి. పార్టీలోకి వస్తే టికెట్ హామీతోపాటు ఎన్నికల ఖర్చంతా భరిస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. ఇతర పార్టీ నేతలతో ఎవరైనా టచ్ లో ఉన్నారా? టికెట్ ఇవ్వకుంటే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటీ? వారు పార్టీ మారితే ఏమైనా నష్టం జరుగుతుందా అనే వివరాలను సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

హామీ ఇచ్చినా.. సిట్టింగుల్లో ఆందోళన..

రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ తీరా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఇస్తారా? అనే ఆందోళన ఎమ్మెల్యేల్లో నెలకొంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో సుమారు 40 మందిని మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. వ్యతిరేకతతోనే వారికి ఉద్వాసన పలుకనున్నారని సమాచారం. దీనికితోడు పలు నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వంతో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయి. ఇతర పార్టీల్లో గెలిచి గులాబీ గూటికి సుమారు 17మంది చేరారు. అయితే ఆ నియోజకవర్గాల్లోనే కాకుండా బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లోనూ విభేదాలు ఉన్నాయి. ఇలాంటి స్థానాల్లో పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తాండూరు, నకిరేకల్, మునుగోడు, ఎల్బీనగర్, ఉప్పల్, మెదక్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, రాజేంద్రనగర్ ఇలా పలు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు టికెట్ ను ఆశిస్తుండటంతో ఇతరపార్టీలు వారిపై ఫోకస్ పెట్టాయి. వారిని చేర్చుకునే ప్రయత్నాలను స్టార్ట్ చేశాయి.

చేరికలంటూ విపక్షాల ప్రకటనలు..

ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ మారుతున్నారని తమ పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధమైందని కాంగ్రెస్, బీజేపీలు ట్రోల్ చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ అధిష్టానం తీరునచ్చక పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలకు ముందు కేసీఆర్ కు పెద్ద ఎదురుదెబ్బ తప్పదని మీడియా ముందు విపక్ష నేతలు పేర్కొంటున్నారు. ముందుగా వచ్చేవారికే టికెట్ ఆఫర్ అంటూ విపక్షాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ఖర్చును సైతం భరిస్తామంటూ పేర్కొంటుండటంతో సిట్టింగ్ లు ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.

ఎన్నికలపై కేసీఆర్ నజర్..

రాబోయే ఎన్నికలకు పార్టీ నేతలను సన్నద్ధం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో పార్టీ పటిష్టత, సంక్షేమ, అభివృద్ధిని తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారని సమాచారం. ప్రతి రోజూ ఒక నియోజకవర్గం చొప్పున సమీక్ష నిర్వహించి ఆ నియోజకవర్గం పూర్తి వివరాలను తెలుసుకొని చేయబోయే కార్యక్రమాలపైనా షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలనే దానిపైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Next Story

Most Viewed