Surendra Gadling: గాడ్లింగ్ బెయిల్ విచారణలో వైదొలగిన మూడో న్యాయమూర్తి

by S Gopi |

ఈయన గత ఏడాది కాలంలో గాడ్లింగ్ బెయిల్ పిటిషన్ విచారణ నుండి తప్పుకున్న మూడో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడం గమనార్హం.

Surendra Gadling: గాడ్లింగ్ బెయిల్ విచారణలో వైదొలగిన మూడో న్యాయమూర్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: 2016 నాటి గడ్చిరోలి అగ్నిప్రమాదం, భీమా కోరేగావ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణ నుంచి తాజా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ మంగళవారం తప్పుకున్నారు. జస్టిస్ పి.కె. మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందు ఎన్ఐఏ వాయిదా కోరిన తరుణంలో, తాను ఈ కేసును విచారించలేనని జస్టిస్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఈయన గత ఏడాది కాలంలో గాడ్లింగ్ బెయిల్ పిటిషన్ విచారణ నుండి తప్పుకున్న మూడో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడం గమనార్హం. గతంలో జస్టిస్ ఏ.ఎస్. చందుర్కర్, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్‌లు కూడా ఇదే రీతిలో విచారణ నుండి వైదొలిగారు. ఇప్పుడు ఈ పిటిషన్‌ను కొత్త ధర్మాసనానికి కేటాయించేందుకు గాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ముందుకు తీసుకెళ్లనున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 2016 డిసెంబర్‌లో సూరజ్‌గఢ్ ఇనుప ఖనిజ గనులకు చెందిన 80 వాహనాలను తగలబెట్టిన కుట్రలో, అలాగే నిషేధిత మావోయిస్టు పార్టీ తరఫున ఆర్గనైజింగ్ చేయడంలో గాడ్లింగ్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఎన్ఐఏ ఆయనపై ఉపా, ఐపీసీలోని కఠిన ఉగ్రవాద వ్యతిరేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మచ్చలేని సుదీర్ఘ న్యాయవాద చరిత్ర ఉందని, కుటుంబానికి ఏకైక ఆధారమని గాడ్లింగ్ వాదిస్తున్నప్పటికీ, ఆరోపణల తీవ్రత దృష్ట్యా బొంబాయి హైకోర్టు, ట్రయల్ కోర్టులు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. 2023 నుంచి సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉన్న ఈ బెయిల్ పిటిషన్.. న్యాయమూర్తులు వరుసగా తప్పుకుంటుండటంతో మరింత ఆలస్యమవుతోంది.

Next Story