స్పీడ్ పెంచిన KCR.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటే టార్గెట్‌గా మరో భారీ ప్లాన్!

by Disha Web Desk 19 |
స్పీడ్ పెంచిన KCR.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటే టార్గెట్‌గా మరో భారీ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలో బీఆర్ఎస్ మరోసభకు సన్నద్ధమవుతోంది. రైతు సభపేరుతో నిర్వహించాలని, 12లక్షల మందితో చేపట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించాలనే తపనతో ప్రణాళికలు రూపొందిస్తుంది. జనసమీకరణపై నేతలు దృష్టిసారించారు.

పొరుగున ఉన్న మహారాష్ట్రలో మరోమారు బీఆర్ఎస్ బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించిన కేసీఆర్.. నాల్గొవ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. సోలాపూర్ గానీ చంద్రపూర్ గానీ లేదా నాగపూర్‌లో గానీ నిర్వహించాలని అధినేత యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సభ ఎక్కడ నిర్వహించేది కొలిక్కి వస్తుందని పార్టీకి చెందిన నేత తెలిపారు. ఇప్పటివరకు నాందేడ్, కాందార్ లోహ, ఔరంగాబాద్‌లో సభలను నిర్వహించి విజయవంతం చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించింది.

బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాలుమోపగానే కిసాన్ సమ్మాన్నిధిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు తలాటీ (వీఆర్ఏ) వ్యవస్థపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ప్రకటించడం తొలి విజయం అని, బీఆర్ఎస్ పూర్తిగా మహారాష్ట్రలో ల్యాండ్ కాకముందే రెండు అద్భుత విజయాలను సాధిస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంకెన్నిచేయవచ్చు? ఎలా చేయవచ్చు అనే విషయాలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని కేసీఆర్ నేతలకు సూచించారు. ప్రజల నుంచి అనూహ్య ఆదరణ వస్తుందని, విజయం సాధిస్తామని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

రైతు సభ పేరుతో..

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతుసభ పేరుతో నాల్గొవ సభను నిర్వహించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. 12లక్షల మందితో భారీ సభ నిర్వహించి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో ఇప్పటివరకు నిర్వహించని విధంగా సభ పెట్టాలని, ఆ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనంను తరలించాలని భావిస్తున్నారు. అందుకోసం స్పీడ్ పెంచుతున్నట్లు సమాచారం. సభను విజయవంతం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించాలన్నదే కేసీఆర్ తపన అని పార్టీ నేతలుఅభిప్రాయ పడుతున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదమే లక్ష్యమని మరోసారి సభలో చాటనున్నారు.

నేతలకు హితబోధ..

బీఆర్ఎస్ విస్తరిస్తున్న క్రమంలో నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. మొదల్లోనే విమర్శనాస్త్రాలు సంధిస్తే పార్టీకి ప్రజల నుంచి ఆదరణ రాధని ఇప్పటికే నేతలకు సైతం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రావటానికి సిద్ధంగా ఉన్నారని, సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారని ఈ తరుణంలో కాంట్రీవర్సి విమర్శలు చేయొద్దని హితబోధ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదే మన నినాదం అని, బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు చేర్చి వారి ప్రేమను పొందాలి.. ప్రజల మనసులు గెలవడం బీఆర్ఎస్ లక్ష్యం అని పేర్కొనట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా కేసీఆర్ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ రాబోయే స్థానిక సంస్థల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.



Next Story

Most Viewed