BRS ప్రకటన తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. వెంట కవిత?

by Disha Web Desk 2 |
BRS ప్రకటన తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. వెంట కవిత?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ యూపీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయలో జరగనున్న అంత్యక్రియలకు కేసీఆర్ హాజరుకానున్నారు. అక్కడ దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పిస్తారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంటారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు వెళ్లారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల అనంతరం అక్కడి నుండి సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరి వరకు ఆయన అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే మొదటిసారి. అక్కడ జాతీయ రాజకీయాలపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. అయితే బీఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకునే సమావేశానికి దూరంగా ఉన్న కవిత ఇవాళ కేసీఆర్ వెంట వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అభిషేక్ రావు‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కవిత కేసీఆర్‌తో కలిసి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ వెంట కవిత.. ఆసక్తికర చర్చ:

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి టార్గెట్ ఎవరు అనే చర్చ ఊపందుకుంది. ఈ కేసులో మొదటి నుంచి కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ రావు ద్వారా దర్యాప్తు బృందం కీలక సమాచారం రాబడుతుందని, అతడు ఇచ్చే సమాచారంతో అధికార టీఆర్ఎస్‌లోని కీలక నేతల గుట్టురట్టు కాబోతోందనేది రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కవిత విషయంలో అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే దసరా పండగ నాడు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీ పరంగా అత్యంత కీలకమైన ఈ సమావేశానికి కవిత డుమ్మా కొట్టడం చర్చకు దారి తీసింది. అందుబాటులో ఉన్నప్పటికీ కవిత ఈ సమావేశానికి ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కేసీఆర్ యూపీ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతుండగా కేసీఆర్ వెంట కవిత కూడా ప్రయాణమై పోవడంతో అసలేం జరుగుతోందనే డౌట్ రాజకీయ వర్గాల నుండి వినిపిస్తోంది.

Next Story

Most Viewed