నిమ్స్‌ కొత్త బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

by Disha Web Desk 21 |
నిమ్స్‌  కొత్త బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త భవనాలను కట్టుకోవడం, వాటికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతోనే మన పని అయిపోదని, వాటి ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,571 కోట్ల ఖర్చుతో కట్టనున్న కొత్త బ్లాక్‌కు బుధవారం భూమిపూజ చేశారు. దశాబ్ది పేరుతో కడుతున్న ఈ బ్లాక్‌లో రెండు వేల కొత్త పడకలు అందుబాటులోకి రానున్నాయని, సుమారు 38 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు వైద్యం అందిస్తాయన్నారు. ఉత్తమమైన సేవలు అందించి తెలంగాణ రాష్ట్రానికి వైద్య రంగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానం లభించాలని ముఖ్యమంత్రి కోరారు. కరోనా సమయంలో మానవీయ కోణంలో సర్వీస్ చేసిన వైద్య సిబ్బందికి కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి వైద్య రంగంలో అనేక ఆధునిక మార్పులు జరుగుతున్నాయని, కార్పొరేట్ ఆస్పత్రులు లక్షలాది రూపాయలను పేషెంట్ల నుంచి వసూలు చేసిన తర్వాత కష్టకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాయని గుర్తుచేశారు. కరోనా సమయంలో వేలాది మంది పేషెంట్లకు చికిత్స చేసిన తర్వాత పేషెంట్ విషమంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ గాంధీ ఆస్పత్రికి వెళ్ళాల్సి వస్తున్నదని, ఎంతో మందిని బతికించిన డాక్టర్లు, నర్సుల సేవలను జన్మలో మర్చిపోలేమన్నారు. ఇప్పుడు నిమ్స్ ఆస్పత్రి సైతం అనేక రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నదని, కొత్త బ్లాక్ తర్వాత మరింతమందికి మెరుగైన సేవలు అంది దేశంలోనే దీనికి ఎక్సెలెన్స్ సెంటర్‌గా ఆవిర్భవించాలన్నారు. కొత్త బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లను పంపిణీ చేశారు.

Read more: మరో BRS ఎమ్మెల్యేపై ఐటీ దాడులు



Next Story

Most Viewed