బీసీ బంధు ఇవ్వాలి.. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ

by Dishafeatures2 |
బీసీ బంధు ఇవ్వాలి.. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ బంధు పథకాన్ని వెంటనే షురూ చేయాలని సీఎం కేసీఆర్​ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. బీసీ సమస్యలపై ఆయన బుధవారం ప్రత్యేక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పురాలేదన్నారు. తన పాదయాత్రలో భాగంగా అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు ఇది కనబడుతోందన్నారు. ‘‘బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీనవర్గాల వారికి చెందాల్సిన సంక్షేమపథకాలు అందడం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధికి మీరు, టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుంది.

ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కులాలవారీ జనగణన చేసి వివరాలు సేకరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నా బయటకు ప్రకటించడం లేదు. ఇదంతా జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీఆర్ఎస్​ ప్రభుత్వం చేస్తున్నది కుట్ర అని స్పష్టంగా అర్థమవుతుంది. స్వరాష్ట్రంలో బీసీలకు 2.3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర కేబినెట్ లో మూడు పదవులు ఇచ్చి దులుపుకున్నారు. ఈ చర్యలతో మీరు బీసీలను అణగదొక్కుతున్నారని అర్థం అవుతోంది ” అంటూ భట్టి విక్రమార్క ఫైర్​ అయ్యారు.

Next Story

Most Viewed