నీళ్లు, విద్యుత్ కొరత.. ఓయూ హాస్టల్స్ క్లోజ్!

by Disha Web Desk 14 |
నీళ్లు, విద్యుత్ కొరత..  ఓయూ హాస్టల్స్ క్లోజ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ మూసివేయనున్నారు. గతంలో ప్రకటించిన వేసవి సెలవుల ప్రకారం మే 1 నుంచి 31 వరకు యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్ సౌకర్యాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు యూనివర్సిటీ బోర్డర్‌లు అందరికీ ఇవాళ చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారు. తీవ్రమైన వేసవి కారణంగా హాస్టళ్లలో నీరు, విద్యుత్ కొరత ఏర్పడిందని నోటీసులో పేర్కొన్నారు. బోర్డర్లు (విద్యార్థులు) అందరూ వర్సిటీకి సహకరించాలని కోరారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో కొన్ని రోజులుగా నీటి కొరత కారణంగా పెద్ద ఎత్తున క్యాంపస్‌లో విద్యార్థినులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి 11 గంటలకు లేడీస్ హాస్టల్​ సమీపంలోని హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే సమస్యను పరిష్కరించకుండా.. తాజాగా హాస్టల్స్ క్లోజ్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో అన్ని రంగాల్లో "మార్పు" వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

Next Story