- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం అడవుల్లో బడే చొక్కారావు షెల్టర్..? ములుగు సరిహద్దుల్లో హై టెన్షన్!
మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మేడారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారంతో ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్డర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడ్వాయి పరిసరాలలో హైఅలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాట్లు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది.
స్వస్థలం నార్లాపూర్పై నిఘా..
ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం (ఎస్ఐబీ), గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలతో కలిసి అటవీ లోయలను జల్లెడ పడుతున్నాయి. చొక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఆ గ్రామం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం లాంటి కీలక ప్రాంతాల్లో పోలీసు పహారా పెరిగింది. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్పోస్టులు నిర్మించి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటవీ పరిసర గ్రామాల్లోనూ పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. భారీ బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి కూడా మావోయిస్టులు ప్రవేశించకుండా గస్తీని పెంచారు.






